రెండు రోజుల ముందే అజ్ఞాతవాసి చూడనున్న మెగా ఫ్యామిలీ

  • January 5, 2018 / 02:09 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజా చిత్రం అజ్ఞాతవాసి సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆత్రంగా ఉన్నారు. తొలి షో చూడాలని టికెట్లు కొనేశారు. అభిమానులు ఇబ్బంది పడకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లోనూ అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని చూడాలని ఫ్యాన్స్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం ప్రత్యేక షో వేయాలని చిత్ర బృందం డిసైడ్ అయింది. విడుదలకు రెండు రోజుల ముందే అంటే జనవరి 8 వ తేదీ రాత్రి మెగా కుటుంబం కోసం “అజ్ఞాతవాసి” ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది.

ఈ సినిమా చూశాక మెగాస్టార్‌ చిరంజీవి తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. జనవరి 9 న అమెరికాలో ప్రీమియర్ షో వేయనున్నారు. ఇక ఇక్కడ జనవరి 10 న అజ్ఞాతవాసి రికార్డుల వేట మొదలు పెడుతాడు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ హీరోయిన్స్ గా నటిస్తుండగా… ఖుష్బూ, బొమన్‌ ఇరానీ, ఆది పినిశెట్టి, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ తో సందడి చేయనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus