ఏదైనా నిర్మాణ సంస్థలో ఒక హీరో రెండు సినిమాలు చేస్తేనే పెద్ద విషయం అనుకుంటున్న రోజులివి. అలాంటిది ఒక హీరో మూడో సినిమా చేస్తున్నాడు అంటే ఎంత పెద్ద విషయం చెప్పండి. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ – సిద్ధు జొన్నలగడ్డ మధ్య ఇదే జరిగింది. నాగవంశీ నిర్మాణంలో సిద్ధు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ తర్వాత ఈ కొత్త సినిమా రూపొందనుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తానేంటో నిరూపించుకున్న స్వరూప్ ఆర్.ఎస్.జే ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
అయితే, ఇక్కడ ఒక్కటే డౌట్. ఈ సినిమా ఆ నిర్మాణ సంస్థ, సిద్ధు కాంబినేషన్లో నాలుగోదో లేక ఐదోదో అవ్వాలి. కానీ ఇప్పుడు సినిమా పీఆర్ టీమ్ మూడోదే అని చెబుతోంది. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషనన్లో రెండు సినిమాలు గతంలో అనౌన్స్ అయ్యాయి. అవే ‘బ్యాడాస్’, ‘కోహినూర్’. ‘బ్యాడాస్’ సినిమాకు పంచ్ లైన్గా ఓ విపరీతమైన వాక్యం కూడా రాశారు. అదే ‘మిడిల్ ఫింగర్ ఓ మనిషి అయితే’. ఈ లైన్తో హీరో పాత్ర చిత్రణ గురించి చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు రవికాంత్ పేరేపు.
అయితే, ఈ సినిమాలు సిద్ధుకి వరుస హిట్లు ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వరుసగా ‘జాక్’, ‘తెలుసు కదా’ లాంటి సినిమాలు చేసి ఇబ్బందికర ఫలితాలు అందుకొని, ఆయన ఇబ్బందిపడ్డాడు, నిర్మాతల్ని ఇబ్బంది పెట్టాడు. ఒకేలాంటి హైపర్ పాత్రలు చేస్తూ మూస టైప్ అయిపోతున్నాడు అనే విమర్శలూ ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో ‘బ్యాడాస్’ ఎందుకు అనుకున్నారేమో స్వూరూప్ కథకు ఓకే చెప్పారు. ఇక ‘కోహినూర్’ సినిమా ఆలోచన ఇప్పుడొద్దు అనుకున్నాం అని నిర్మాత నాగవంశీనే చెప్పారు.
మరి స్వరూప్ సినిమాలో పాత్ర ఎలా ఉంటుంది అనేది చూడాలి. ‘కోహినూర్’ గురించి క్లారిటీ వచ్చినా ‘బ్యాడాస్’ ప్రాజెక్ట్ ఉన్నట్టా.. లేనట్టా అనే విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. ఇప్పుడు స్వరూప్ సినిమా విజయం మీద ఆ సినిమాలు ఆధారపడి ఉంటాయి అనుకోవచ్చు. అయితే టీమ్ ప్రెస్నోట్లో ఎక్కడా ‘బ్యాడాస్’ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం..