బాహుబలికి షాక్ ఇచ్చిన సింగపూర్ సెన్సార్ బోర్డు

  • May 19, 2017 / 05:58 AM IST

జీవనదిలా ప్రవహిస్తున్న బాహుబలికి ఆనకట్ట ఎదురైంది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి కంక్లూజన్ నాలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 9000 థియేటర్లలో రిలీజ్ అయి 20 రోజుల్లో 1500 కోట్ల మైలు రాయిని దాటింది. ఓ వైపు ప్రశంసల జల్లు, మరో వైపు కలక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రానికి సింగపూర్ లో చుక్కఎదురైంది. నిర్మాతలు శోభు, ప్రసాద్ లు బాహుబలి 2 సింగపూర్ లో రిలీజ్ చేయడానికి అక్కడి సెన్సార్ సభ్యుల వద్దకు చిత్రాన్ని తీసుకుపోయారు. బాహుబలి రెండో పార్ట్ ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఏ(ఎన్సీ 16) సర్టిఫికేట్ జారీ చేశారు. అంటే అక్కడ 16 ఏళ్ల లోపు పిల్లలను బాహుబలి 2 సినిమాను చూసేందుకు అనుమతించరు.

సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, భారత సెన్సార్ బోర్డ్ సభ్యులు బాహుబలి 2కి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారు. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు ఈ సినిమాని చూడవచ్చని అర్ధం. అయితే సినిమాలో సైనికుల తలలు నరికే సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో సింగపూర్ సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీని వల్ల ఆ దేశంలో కలక్షన్స్ తగ్గే ఆస్కారం ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus