రంగుల ప్రపంచం లాంటి చిత్రసీమలో వెలిగిపోవాలని ఎన్నో కలలతో వచ్చేవారికి ఇక్కడికి వచ్చాక కానీ అసలు సంగతి తెలియడం లేదు. అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగి సొంతూరికి వెళ్లలేక, ఇక్కడ నెగ్గుకురాలేక నరకయాతన అనుభవించేవారు కృష్ణానగర్లో ఎందరో ఉన్నారు. ఇక నానా కష్టాలు పడి సినిమాల్లో నిలదొక్కుకుంటే నా అనుకున్న వాళ్ళు, అయినవాళ్లు చేతిలో మోసపోయిన నటీనటులకు లెక్కేలేదు. ఆస్తులు, డబ్బు కోసం ఆదరించిన వారిని నిలువునా మోసం చేసినవారు ఇండస్ట్రీలో అడుగడుగునా కనిపిస్తారు.
అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ కథ కూడా.! బాలీవుడ్ ని ఒకప్పుడు తన అందం, నటనతో ఏలిన లైలా ఖాన్ (Laila Khan) ఇప్పటి యువతకి తెలియకపోవచ్చు. యువత ఆమెకు ఫిదా అయ్యారు. దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. బాలీవుడ్ సూపర్స్టార్ రాజేష్ ఖన్నా సరసన ‘వాఫా: ఏ డెడ్లీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లైలా బాగా బిజీ అయ్యారు.
వెకేషన్..కు వెళ్లే అలవాటున్న లైలాఖాన్ (Laila Khan) తన కుటుంబంతో కలిసి ఓ విహారయాత్రకు వెళ్లి ఆ తర్వాత ఫ్యామిలీతో సహా అదృశ్యమైంది. బాలీవుడ్లో మిస్టరీగా మారిన ఈ సంఘటనను ఆ టైంలో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అప్పటికే తన కుటుంబం కనిపించడం లేదని లైలా ఖాన్ తల్లి మొదటి భర్త, అసలు తండ్రి అయిన నాదిర్ షా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ ఇక్బాల్ తక్..ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.
ఈ నేపథ్యంలో తానే 2011లో మహారాష్ట్రలోని నాసిక్ శివార్లలో ఉన్న ఇగత్ పురిలో లైలా ఖాన్, ఆమె తల్లి షెలీనా, ఆమె కజిన్స్ అజ్మీనా, జారా, ఇమ్రాన్, రేష్మాలను కాల్చి చంపినట్లు అంగీకరించాడు. అనంతరం వారి మృతదేహాలను అదే బంగ్లాలో పాతిపెట్టినట్లు చెప్పాడు. ఆర్ధిక లావాదేవీలు, ఆస్తి, ద్వేషం కారణంగానే లైలాఖాన్ కుటుంబాన్ని పర్వేజ్ హతమార్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దాదాపు 12 ఏళ్ల పాటు ఈ సామూహిక హత్యలపై విచారణ జరగ్గా పర్వేజ్కు మరణశిక్ష విధిస్తూ 2024 మే 24న న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది.