అను, పూజలపై ఉన్న మచ్చ చెరిగిపోతుందా?

  • September 7, 2018 / 12:04 PM IST

సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. అది లేకుండా ఏంత కష్టపడినా విజయం అల్లంతదూరాన ఉండిపోతుంటుంది. అసలే సెంటిమెంట్ కి ప్రాధాన్యత ఇచ్చే ఫిలిం మేకర్స్ .. హిట్ ఉంటేనే క్యూ కడుతారు. లేదంటే ఐరెన్ లెగ్ అని పేరు పెట్టేస్తారు. ప్రస్తుతం ఆ పేరు ఇద్దరికీ ఉంది.. వారే పూజా హెగ్డే, అను ఇమ్యానియేల్. ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. “ఒక లైలా కోసం”లో చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో “మొహెంజొ దారో” చిత్రంతో అడుగుపెట్టింది. ఈ సినిమా తీవ్ర నిరాశపరచడంతో టాలీవుడ్ కే వచ్చేసింది. ఈసారి గ్లామర్ డోస్ పెంచింది. దువ్వాడ జగన్నాథం లో బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది.

అయితే ఈ సినిమాలు ఏవీ సూపర్ హిట్ జాబితాలో చేరలేదు. రీసెంట్ గా చేసిన సాక్ష్యం అయితే భారీ నష్టాన్ని మిగ్లిచింది. దీంతో ఆమెకు ఐరెన్ లెగ్ అని పేరు పెట్టారు. ఇక మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అను ఇమ్యానుయేల్… “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో హీరోయిన్ గా నటించింది. ఏది విజయం సాధించలేదు. అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య అయినా కెరీర్ ని పరుగులెత్తిస్తుందనుకుంటే అది కూడా నిరాశపరిచింది. దీంతో ఆమెకు కూడా ఐరెన్ లెగ్ గర్ల్ అని పేరు పెట్టేసారు. అందుకే ఆమె ఆశలన్నీ శైలజారెడ్డి అల్లుడు మూవీపైనే పెట్టుకుంది. పూజా హెగ్డే కూడా తాజాగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఇవి హిట్ కాకుంటే మాత్రం టాలీవుడ్ లో వీరి స్థానం గల్లంతు అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus