Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలు, లెక్కల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ‘మన ప్యానెల్‌’ విజయాన్ని అందుకుంది. అధ్యక్షుడిగా ఇప్పటికే ఇదే ప్యానెల్‌ నుండి సీనియర్‌ నిర్మాత సి.కల్యాణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ పోటీ చేశాయి. అందులో ‘మన ప్యానెల్‌’ నుండి ఓ ఉపాధ్యక్షుడు, ఓ కోశాధికారి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, 12మంది ఈసీ సభ్యులు కూడా గెలుపొందారు.

Producers Council

పోలింగ్‌లో 1200మంది నిర్మాతలకు గానూ 643 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిన్న సినిమాలకి అండగా నిలబడతామనే లక్ష్యంతో పోటీ చేసిన మన ప్యానెల్‌ వైపే నిర్మాతలు మొగ్గు చూపడం గమనార్హం. మన ప్యానెల్‌ నుండి మోహన్‌ వడ్లపట్ల, ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ నుండి దామోదర్‌ ప్రసాద్‌ మండలి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. జాయింట్‌ సెక్రటరీలుగా మన ప్యానెల్‌ నుండి అమ్మిరాజు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గెలుపొందారు. కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.

ఇక ఈసీ సభ్యులుగా ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ నుండి మైత్రీ రవిశంకర్, నిరంజన్‌ రెడ్డి, డీఎస్‌ రావు గెలుపొందారు. మన ప్యానెల్‌ నుండి పద్మిని, ఏషియన్‌ సినిమాస్‌ సునీల్, మోహన్‌ గౌడ్, శివలెంక కృష్ణ ప్రసాద్, దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, శ్రీనివాసరావు, పుల్లారావు, బాపిరాజు, ఆర్కే గౌడ్, నయీం ఎన్నికయ్యారు. సెక్రటరీ పోస్టుకు సంబంధించి ఫలితం వెల్లడించలేదు.

సెక్రటరీ పోస్టు గురించి ప్రస్తుతం కోర్టులో కేసు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాన్ని కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్‌ అప్పగించారు. ఈ నెల 8న కోర్టులో జడ్జి సమక్షంలో సెక్రటరీ ఎన్నికల ఫలితాల్ని వెల్లడిస్తారు. 95 శాతం మెజారిటీతో మన ప్యానెల్‌ సభ్యుల్ని గెలవడం గమనార్హం.

శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus