‘బిగ్ బాస్’ కు వెళ్ళి… జనాల గురించి తెలుసుకోవాలని ఉంది : హేమ

  • July 18, 2019 / 04:08 PM IST

తెలుగులో ‘బిగ్ బాస్’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1, నాని హోస్ట్ చేసిన సీజన్ 2 లకు మంచి స్పందన వచ్చింది. ఇక మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయనుండడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. జూలై 21 న ప్రారంభం కాబోతున్న ఈ షో కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ ఒక ‘బ్రోతల్ హౌస్’ అంటూ మాజీ యాంకర్ శ్వేతా రెడ్డి అలాగే బిగ్ బాస్ హౌస్ లో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉందంటూ ‘ఫిదా’ ఫేమ్ గాయత్రి గుప్తా ఆరోపణలు వ్యక్తం చేస్తూ కేసులు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఇక కేతిరెడ్డి కూడా ఈ షో అసభ్యకరంగా ఉంటుందని.. ప్రతీ ఎపిసోడ్ ను సెన్సార్ చేసి రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చెయ్యాలని.. హైకోర్టు ను ఆశ్రయించడం కూడా సంచలనమైంది. ఇలా షో ప్రారంభం కాకముందే రకరకాల వివాదాలు చోటు చేసుకోవడంతో.. అసలు షో మొదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నటి హేమ చేసిన కామెంట్స్ తెగ ఆసక్తిగా మారాయి.

హేమ మాట్లాడుతూ… “ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బిగ్ బాస్ 3 ని ఏమాత్రం ఆపలేవు. అయినా ఈ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున చాలా పెద్ద మనిషి, చాలా బాధ్యతగల వ్యక్తి, ఆయన మంచి ఫ్యామిలీ నుండీ వచ్చినవారు. ‘క్యాస్టింగ్ కౌచ్’ లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే … ఆయన ఈ షో చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు. అయినా క్యాస్టింగ్ కౌచ్ నెల రోజుల ముందు నుండీ జరుగుతున్నప్పుడు అప్పుడే బయటకు చెప్పాలి. ఎవడైనా నన్ను ఏదైనా అంటే ఆరోజే స్పందిస్తాను. ఆ రోజే మీడియాకు ఎక్కుతా.. లేదంటే ఆరోజు వాడి కాలర్ పట్టుకుంటాను. నన్ను సెలక్ట్ చేయలేదు అన్న తర్వాత ఇలా మాట్లాడటం ఎంత వరకూ న్యాయం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక ‘బిగ్ బాస్’ లాంటి రియాలిటీ షోలో పాల్గొనాలని నాకు కూడా ఆశగా ఉంది. రాజకీయాల్లోకి వస్తున్న నన్ను ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అనే విషయాన్ని ఇలాంటి షోలో పాల్గొని తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ అకాశం వస్తే తప్పకుండా వెళతాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus