టాలీవుడ్లో ప్రస్తుతం సినిమా విజయాన్ని కొలిచే ప్రమాణాలు మారిపోయాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒక సినిమా హిట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే హడావిడి, బాక్సాఫీస్ వద్ద వచ్చిన వసూళ్ల ఆధారంగా నిర్ణయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు అడివి శేష్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా సంచలన హిట్ కొట్టిన ‘ధురందర్’ చిత్రం గురించి మాట్లాడిన ఆయన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్. థియేటర్లలో సినిమా చూసిన తర్వాత తనకు ఈ చిత్రం సాధారణ కమర్షియల్ విజయాన్ని మించి నిలిచే స్థాయి సినిమా అనిపించిందని ఆయన తెలిపారు. కేవలం వసూళ్ల కోణంలో కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా మంచి ప్రమాణాలతో రూపొందిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే చర్చలు, రికార్డుల హడావిడి కంటే సాధారణ ప్రేక్షకుడికి ఒక మంచి కథతో కూడిన సినిమా ముఖ్యమని శేష్ అభిప్రాయపడ్డారు. పాత కాలంలో వచ్చిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మాయాబజార్, షోలే ఎంత వసూలు చేశాయన్నది ఇప్పుడు పెద్దగా ఎవరికీ గుర్తుండకపోవచ్చు. కానీ ఆ సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎంత కాలం నిలిచిపోయాయో అన్నదే అసలు విజయం అని ఆయన పేర్కొన్నారు.
అలాగే సినిమా అనేది ఒక కళ మాత్రమే కాకుండా, నిర్మాతకు సంబంధించిన ఒక పెద్ద బాధ్యత కూడా అని అడివి శేష్ గుర్తుచేశారు. నిర్మాత పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకుంటూనే, మంచి కథతో నాణ్యమైన సినిమా అందించడం చిత్రబృందం బాధ్యత అని ఆయన అన్నారు. అనవసరమైన హైప్ లేదా రికార్డుల కోసం పరుగు పెట్టడం కంటే, నిజాయితీగా మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకుల ఆదరణ స్వయంగా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10 న విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రానికి శనియేల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, సుప్రియ అక్కినేని ప్రొడ్యూస్ చేస్తున్నారు.