తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా ప్రేక్షకులకు దగ్గరైన వేణు యెల్దండి, దర్శకుడిగా మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా కానీ బలంగా తన ముద్ర వేశారు. చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణంలో దాదాపు 200కి పైగా సినిమాలు ఉన్నాయి. ప్రతిభ ఉన్నా, సరైన కమర్షియల్ బ్రేక్ లేకపోవడం వల్ల ఒక దశలో ఐరన్ లెగ్ అనే అనవసరమైన ట్యాగ్ ఆయనను వెంటాడింది. మంచి పాత్రలు చేసినా, సినిమాలు ఆడకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. తనతో పాటు వచ్చినవాళ్లు స్టార్లుగా ఎదుగుతుంటే, తాను మాత్రం వెనుకబడిపోతున్నాననే బాధ ఆయనను లోలోపల ఉండేదని చెప్పుకొచ్చారు.
అగ్ర దర్శకులతో పరిచయాలు ఉన్నప్పటికీ, సెంటిమెంట్ భయంతో పాత్రలు దక్కని రోజులు వేణుకు ఎన్నో ఉన్నాయట. అదే సమయంలో, సినిమా అంటే సెంటిమెంట్ల కంటే కథే ముఖ్యం అని నిరూపిస్తూ ఆయన దర్శకుడిగా తీసిన ‘బలగం’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. గ్రామీణ జీవనాన్ని హృద్యంగా చూపిన ఈ చిత్రం వేణులోని అసలైన కథకుడిని బయటకు తీసుకొచ్చింది.
ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’తో మరో అడుగు ముందుకు వేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ సినిమా హీరో పాత్రలో కూడా దేవి శ్రీ ప్రసాద్ యే నటిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యానికి తగ్గ బలమైన కథ, భావోద్వేగాలు ప్రధానంగా నిలవనున్నాయి. కథ మరియు దర్శకత్వం వేణు యెల్దండిదే కాగా, ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.