టాలీవుడ్లో హీరోయిన్లు ఐరన్ లెగ్ అవ్వడం, గోల్డెన్ లెగ్ అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. ఇంకొక విషయం ఏంటంటే.. ఐరన్ నుండి గోల్డెన్కి మారడం, గోల్డెన్ నుండి ఐరన్కి మారడం కూడా పెద్ద కష్టం కాదు. వీకెండ్ మారగానే వాళ్ల పరిస్థితి కూడా మారుతుంది. ఇలా ఐరెన్ లెగ్ అనిపించుకున్న కథానాయికలు టాలీవుడ్లో చాలామందే ఉన్నారు. ఒక్క విజయం సాధిస్తే చాలు వెంటనే వారు బంగారం అయిపోతారు. రీసెంట్గా అలా హిట్ కొట్టి బంగారు పాదం అయిపోయింది భాగ్యశ్రీ బోర్సే.
మూడేళ్ల క్రితం ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ.. ఆ తర్వాత నుండి వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ఒక్క సినిమాకు కూడా సరైన ఫలితం రాకపోయినా వరుస అవకాశాలు అయితే సంపాదిస్తూ ఉంది. అలా చేసిన రీసెంట్ సినిమా ‘లెనిన్’. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా సరైన విజయం అందుకోని అఖిల్ సినిమా కాబట్టి ఈ సినిమా కూడా చాలామంది ఆశలు లేవు. దీంతో భాగ్యశ్రీకి మరో ప్లాఫ్ పక్కా అనుకున్నారు. కానీ అఖిల్ అండ్ కో. పెట్టుకున్న నమ్మకం నిజమై సినిమా మంచి విజయం అందుకుంది.
ఈ క్రమంలో భాగ్యశ్రీకి కూడా తెలుగులో తొలి హిట్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఇలాంటి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నేను పడిన కష్టానికి ఫలితం ఇది. ‘లెనిన్’ విజయంతో నాలో ఆసక్తి, ఉత్సాహం రెట్టింపయ్యాయి. నా కుటుంబానికి నేను ఎప్పుడూ స్టార్నే. చిత్రపరిశ్రమలో పెద్ద పెద్ద నటులతో కలిసి నటించడం చూసి వాళ్లు సంతోషపడ్డారు. బాక్సాఫీస్ వసూళ్లు నా ఫ్యామిలీ ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్లకి నేను స్క్రీన్ మీద కనపడడమే గొప్ప విషయం అని చెప్పింది భాగ్యశ్రీ.
అయితే, తన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో కొందరు అన్లక్కీ అన్నారు. ఆ మాటలు ఎప్పుడూ నన్ను బాధించలేదు. అయితే ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇండస్ట్రీలో ఇప్పటివరకు తాప్సీ, శ్రుతి హాసన్, శ్రీలీల లాంటి వారికి ఇలాంటి ఫేజ్ ఎదురైంది. అయినా సినిమా విజయం సాధించకపోతే ఏ ఒక్కరినో బాధ్యుల్ని చేయడం సరికాదు. సినిమా అనేది టీం వర్క్. ప్రతి ఒక్కరి కృషి సినిమాలో ఉంటుంది అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.