సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాల్లోనే కాదు.. సమాజంలో జరిగే అనేక అంశాలపై స్పందిస్తూ ఉంటారు ప్రముఖ గాయని చిన్మయి. ఇప్పుడే కాదు ఎన్నో ఏళ్లుగా ఆమె ఇలానే చేస్తూ వచ్చారు. ఆమె రెయిజ్ చేసిన విషయాలు కొన్ని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలా ఉంటే.. మరికొన్ని లేనిపోని సమస్యలకు దారితీసే చర్చలకు కారణమవుతాయి. ఇప్పటివరకు ఆమె రియాక్షన్ వల్ల ఇతరులకు తలనొప్పి వస్తే.. ఇప్పుడు ఆమెకే ఇబ్బందిని తీసుకొచ్చింది. ఆమె మీద కేసు నమోదైంది. ఏమైందంటే?
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చిన్మయి రీసెంట్గా ఎక్స్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గం మనోభావాలను దెబ్బ తీసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి కారణం ఆమె అమెరికా వ్యాపారవేత్త ఎప్స్టీన్ వ్యవహారం గురించి చేసిన కామెంట్లే. అమెరికాలో ఎప్స్టీన్ వ్యాపారవేత్త ఒక పార్టీలో భాగంగా తన అతిథుల కోసం కొంతమంది యుక్తవయసు అమ్మాయిలను సిద్ధం చేశారని పెద్ద ఎత్తున ప్రపంచ మీడియాలో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. దీని మీదే ఇప్పుడు చిన్మయి కామెంట్స్ చేశారు.
ఎప్స్టీన్ ఇండియాలో పుట్టుండి ఉంటే అతను దేవుడి పాటలు పాడుతూ, భజనలు చేసి ఉంటే ఈపాటికి ఇక్కడ బాబాజీ అయ్యేవాడు, ప్రజలు కూడా అతని నెత్తిన పెట్టుకునేవారు అనే అర్థం వచ్చేలా కొన్ని కామెంట్లు చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు కనిపించాయి. ప్రతి విషయాన్ని హిందూ మతానికి ముడిపెట్టి ఇలా వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదు అంటూ విమర్శలు వచ్చాయి. హిందువులను ఇలా రెచ్చగొట్టడం చిన్మయికి అలవాటైపోయింది అంటూ కొన్ని కామెంట్లు కనిపించాయి.
దీంతో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చిన్మయిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. ఇవే కాదు గతంలో ఆమె ఓ వర్గం సంప్రదాయాలు, సంస్కృతి మీద కామెంట్లు చేశారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి.