గతంలో ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ ని యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ తన సినిమా కోసం రెజిస్టర్ చేయించుకున్నారు.
తర్వాత సిద్దు జొన్నలగడ్డ, నాగవంశీ..ల సినిమా కోసం రిక్వెస్ట్ చేయగా.. ఆ టైటిల్ ని అతను ఇవ్వడం జరిగింది. కానీ రిలీజ్ కి 2 నెలల ముందు ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ ని మార్చేసి ‘డీజే టిల్లు’ గా పెట్టి రిలీజ్ చేశారు. తర్వాత ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ వేరే సినిమా కోసం పెట్టుకున్నారు.
మరోపక్క తల్లాడ సాయి కృష్ణ తన సినిమాకి ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం'(Chettu Meedha Dhayyam Nakem Bhayam) పేరు పెట్టుకున్నారు. త్వరలో ఆ సినిమా రిలీజ్ కానుంది. ఈరోజు టైటిల్ పోస్టర్ లాంచ్ జరిగింది. ఇందులో భాగంగా దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ.. ఓ షాకింగ్ విహాయాన్ని బయటపెట్టారు.ఆయన మాట్లాడుతూ… ” ఈ సినిమా కోసం మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ ని రెజిస్టర్ చేయించుకున్న సంగతి తెలిసిందే.
అయితే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వాళ్లు ఆ టైటిల్ కావాలని సంప్రదిస్తే మేము ఇవ్వడం జరిగింది.అయితే ఆ టైటిల్ కోసం నాకు ఆఫర్ చేసిన అమౌంట్ ఒకటి. కానీ ఫైనల్ గా వాళ్ళు ఇచ్చింది కేవలం లక్ష రూపాయలు మాత్రమే. మిగిలిన డబ్బు ఇవ్వలేదు. ఇండస్ట్రీలో మంచి రిలేషన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో నేను కూడా మిగతా డబ్బు కోసం ఎటువంటి రచ్చ చేయలేదు.
కాకపోతే మొన్నామధ్య హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒక సందర్భంలో మాట్లాడుతూ… ‘ ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.ఆయన ఎందుకు అలా చెప్పారో నాకు తెలీదు. నాకు పూర్తి డబ్బులు అయితే ఇవ్వలేదు. బహుశా సిద్ధు జొన్నలగడ్డకి కూడా ఈ విషయం తెలిసుండకపోవచ్చు అనుకుంటున్నాను” అంటూ షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.
ఇక ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ సినిమా గురించి అతను స్పందిస్తూ… ఇదొక హారర్ కామిడీ సినిమా అని.. తప్పకుండా అందరినీ భయపెడుతూ నవ్విస్తూ అలరిస్తుందని తెలిపాడు. ‘శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్’ సంస్థపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తల్లాడ సాయి కృష్ణ, మాధురి, బాలు, రంజిత్ లు నటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ గారు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.అలాగే ఈ చిత్ర ఆడియో హక్కులను ‘శబరి మ్యూజిక్’ సంస్థ ధక్కించుకుంది.