కనిపించేది కొద్దిసేపు.. రెమ్యూనరేషన్ మాత్రం కోట్లలో

  • June 19, 2019 / 06:29 PM IST

రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె జోడీకి బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. అంతేకాదు వీళ్ళది మంచి హిట్‌ కాంబినేషన్‌ కూడా. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ‘రామ్‌ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్‌’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. ఈ మూడు సినిమాలకు సంజయ్ లీలా భన్సాలీనే దర్శకత్వం వహించడం విశేషం. తాజాగా మరోసారి ఈ జోడీ తెరపై మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ’83’ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా కలిసి నటించబోతున్నారు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఈ జోడీ నటించబోతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. 1983లో టీమ్‌ ఇండియా క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ గెలిచిన నేపథ్యంలో అప్పటి కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా ’83’ సినిమా రూపొందుతోంది.

కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. కపిల్‌దేవ్‌ భార్య రోమి భాటియా పాత్ర కోసం దీపికాని సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె హీరోయిన్‌ తరహాలో కాకుండా కేవలం కొద్దిసేపు మాత్రమే మెరవనున్నారు. దీని కోసమై ఏకంగా రూ.14 కోట్లు పారితోషికంగా దీపికాకి చిత్ర యూనిట్‌ ఇవ్వబోతుందని సమాచారం. మరోవైపు ఈ సినిమాకి దీపికా కూడా ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితం ఆధారంగా మేఘనా గుల్జర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఛపాక్‌’లో లక్ష్మి అగర్వాల్‌ పాత్రలో దీపికా నటిస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి కూడా ఓ నిర్మాతగా దీపికా వ్యవహరిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus