దేశంలో దొంగలు పడ్డారు

  • October 4, 2018 / 12:09 PM IST

స్టార్ కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యుమ్ కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ నటించిన చిత్రం “దేశంలో దొంగలు పడ్డారు”. గౌతమ్ రాజ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు నమోదయ్యేలా చేశాయి. రాంగోపాల్ వర్మ, చిరంజీవి వంటి ప్రముఖులు సినిమాను మెచ్చుకోవడంతో ప్రేక్షకుల్లోనూ సినిమా చూడాలన్న ఆసక్తి మొదలైంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది రివ్యూ చదివి తెలుసుకోండి..!!

కథ : శక్తి (ఖయ్యుమ్), జిజ్జూ (షాని) చిన్ననాటి స్నేహితులు. కలిసి పెరిగిన ఈ స్నేహితుల ద్వయం.. దొంగతనాలు కూడా కలిసే ఒక పథకం ప్రకారం చేస్తూ కాలం నెట్టుకొస్తుంటారు. రెగ్యులర్ దొంగతనాల్లో భాగంగా ఒకసారి ఓ మోడ్రన్ బ్రోతల్ హౌస్ నుంచి ఓ ప్రాస్టిట్యూట్ (తనిష్క్ రాజన్) ను కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఆమెను అడ్డు పెట్టుకొని సదరు బ్రోతల్ హౌస్ ను రన్ చేస్తున్న డాన్ (లోహిత్) మరియు అతడి వెనకనున్న బడా డాన్ (పృధ్వీ)ని 20 లక్షలు అడుగుతారు. ఆ సొమ్మును శక్తి & జిజ్జు చేజిక్కించుకోగలిగారా? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “దేశంలో దొంగలు పడ్డారు” కథాంశం.

నటీనటుల పనితీరు : ఖయ్యుమ్ కథానాయకుడిగా మెప్పించలేకపోయాడు. నందు చెప్పిన డబ్బింగ్ మినహా.. సినిమాలో ఏ ఒక్క సన్నివేశంలోనూ తనదైన హావభావాలతో కానీ, మ్యానరిజమ్స్ తో కానీ హీరో అనిపించుకోలేకపోయాడు. షానికి ఈ సినిమాలో చాలా పెద్ద రోల్ ఇచ్చారు కానీ.. మనోడు సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. అనవసరమైన ఓవర్ యాక్షన్ తో కొన్ని సన్నివేశాల్లో ఇరిటేట్ చేశాడు కూడా.

తనిష్క్ రాజన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అమ్మాయి సొంత డబ్బింగ్ చెప్పిందో లేదో తెలియదు కానీ.. లిప్ సింక్ కూడా బాగుంది. అయితే.. అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండి ఉంటే ఇంపాక్ట్ హెవీగా ఉండేది. నెగిటివ్ రోల్లో పృధ్వీ ఆకట్టుకొన్నాడు. అతడి పాత్ర సినిమాకి ఏకైక హైలైట్.

సాంకేతికవర్గం పనితీరు : శాండీ సంగీతం, నేపధ్య సంగీతం బాగున్నాయి. సాహిత్యం కూడా సన్నివేశానికి తగ్గట్లుగా ఉంది. శేఖర్ డ్రోన్ షాట్స్ రెండు మూడు బాగున్నాయి కానీ.. డ్రోన్ కెమెరా ఉంది కదా అని పోలోమని అవే షాట్స్ రిపీటెడ్ గా వాడడం వల్ల సినిమాకి ఒరిగిందేమీ లేదు. కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి కానీ.. లైటింగ్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకొంటే బాగుండేది.

డైరెక్టర్ ఎంచుకొన్న కథలో ఉన్న పట్టు.. కథనంలో లేదు. తక్కువ క్యారెక్టర్స్ తో ఎక్కువసేపు సినిమా సాగదీద్దామనుకొన్నాడు. అదే సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. లెంగ్త్ మరీ ఎక్కువైంది, మూల కథ శ్రీనువైట్ల “వెంకీ” సినిమాకు మాతృకలా ఉండగా.. స్క్రీన్ ప్లే కూడా పలు సినిమాల నుంచి స్పూర్తి పొందినట్లే అనిపిస్తుంది. ఓవరాల్ గా.. దర్శకుడిగానే కాక కథకుడిగానూ విఫలమయ్యాడు.

విశ్లేషణ : సినిమా తీయాలి అనే ప్యాషన్ తోపాటు సినిమాకి అత్యంత ముఖ్యమైన “కథ-కథనం” మీద మంచి పట్టు ఉండాలి. రెండిట్లో ఏది లోపించినా అవుట్ పుట్ ఎలా ఉంటుంది అనేందుకు “దేశంలో దొంగలు పడ్డారు” ఒక ఉదాహరణ మాత్రమే.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus