టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి (AS Ravi Kumar) మృతి చెందారు. సడన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది. దీంతో టాలీవుడ్ కి ఒక్కసారిగా పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని టాలీవుడ్ సెలబ్రిటీలు ఆకాంక్షిస్తూ.. తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఏ.ఎస్.రవికుమార్ చౌదరి 2002 లో ‘మనసుతో’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. కానీ ఆ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత విలన్ గా పాపులర్ అయిన గోపీచంద్ ను హీరోగా పెట్టి ‘యజ్ఞం’ అనే సినిమా చేశారు. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఏ.ఎస్.రవికుమార్ చౌదరిని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టింది. బాలకృష్ణ అయితే పిలిచి మరీ ‘వీరభద్ర’ అనే సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత నితిన్ తో ‘ఆటాడిస్తా’ చేశారు.
ఇది సో సోగా ఆడింది. అటు తర్వాత చేసిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సినిమాలు బాగానే ఆడాయి. అటు తర్వాత మళ్ళీ ‘సౌఖ్యం’ ‘తిరగబడరసామి’ సినిమాలు నిరాశపరిచాయి. ఇక సుకుమార్ తెరకెక్కించిన ‘జగడం’ లో లడ్డు అనే పాత్రలో కూడా నటించారు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి. ఈ మధ్యనే ‘ఫ్లాష్ బ్యాక్’ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఇంతలో ఆయన మరణించడం నిజంగా షాకిచ్చే విషయమే అని చెప్పాలి.