తెలుగు సినిమాను గౌరవించుకునేలా తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఏటా గద్దర్ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2025కిగాను ఇటీవల ప్రకటించిన అవార్డులను ఉగాది సందర్భంగా గురువారం గ్రహీతలకు అందజేశారు. తెలుగుసినీ తారలు, పురస్కార గ్రహీతలతోపాటు హిందీ పరిశ్రమ నుండి మాధురీ దీక్షిత్, జెనీలియా, రితేశ్ దేశ్ముఖ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎఫ్.డి.సి ఎండీ సీహెచ్ ప్రియాంక తదితరులు పురస్కారాల్ని ప్రదానం చేశారు.
* ఉత్తమ నటి పురస్కారం అందుకోవడానికి వేదికపైకి వచ్చిన రష్మిక మందనను ‘మా ఊరి కోడలు…’ అంటూ యాంకర్ సుమకి పరిచయం చేశారు రేవంత్ రెడ్డి.
* పురస్కారం అందుకున్న అనంతరం రష్మిక మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్న ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకం. ఒకప్పుడు నా నటన గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చేవి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నా నటనని మెచ్చుకుంది అన్నారు.
* ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న నాగచైతన్య మాట్లాడుతూ 16 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఈ గుర్తింపు ప్రత్యేకం అన్నారు.
* సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ కథానాయిక మాధురీ దీక్షిత్ నుండి చిరంజీవి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యానికి గురైన పురస్కారాల్ని పునరుద్ధరించి, పునరుజ్జీవం పోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
* సినిమావాళ్లకు అతి దగ్గరగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గద్దర్ సినీ పురస్కారాల్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమాను ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చిరంజీవి కోరారు.
* అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం అందుకున్న జయసుధ మాట్లాడుతూ అక్కినేనికి గుండెకు చికిత్స జరిగిన అనంతరం తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు ‘ట్రెండ్ మారిపోయింది కదా, నటనలో ఏమైనా మార్పులు చేసుకోవాలా?’ అని అడిగారని గుర్తు చేసుకున్నారు.
* కాంతారావు పురస్కారాన్ని అందుకున్న ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ 13 ఏళ్లపాటు సినీ పరిశ్రమ ఈ పురస్కారాల కోసం ఎదురు చూసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి మరో హీరో కాంతారావు అని అన్నారు.
* సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తరఫున బి.ఎన్.రెడ్డి పురస్కారాన్ని అందుకున్న కమల్ హాసన్ మాట్లాడుతూ గద్దర్కు ఉన్న మిలియన్లకొద్దీ అభిమానుల్లో తాను ఒకడినని చెప్పారు.
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గద్దర్.. ప్రజా యుద్ధనౌక. గద్దర్ అనే ఒక పేరు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గళం. గద్దర్ గళమంటే తెలియని వారు ఈ దేశంలో లేరు అన్నారు.
* పైడి జయరాజ్ పురస్కారాన్ని కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అశ్వనీతద్, కె.ఎల్. కాంతారావు ఫిల్మ్ అవార్డును ఆర్. నారాయణ మూర్తి, సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డును సుద్దాల అశోక్తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డును జయసుధ స్వీకరించారు.