అవార్డుల విషయంలో ఆస్కార్ అవార్డ్స్ ఇటీవల నిబంధనలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐ వినియోగించే తీసే/ రాసే సినిమాల విషయంలో పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. ఈ విషయంలో ప్రపంచ సినిమా రంగంలో చర్చ జరుగుతున్న సమయంలోనే మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ గోల్డెన్ గ్లోబ్స్ కూడా ఏఐ విషయంలో కొత్త నిబంధనలు విడుదల చేశారు. 2027లో జరగనున్న వేడుకల కోసం తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు.
సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై గోల్డెన్ గ్లోబ్స్ సంస్థ నిబంధనలను రూపొందించింది. హాలీవుడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 2027 అవార్డుల కోసం వచ్చే ఎంట్రీలలో ఏఐ ఉపయోగించినవి ఉండొచ్చు.. కానీ, మానవ క్రియేటివిటీనే ప్రధానంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏదైనా సన్నివేశంలో ఏఐని వాడినప్పుడు దానిని తప్పనిసరిగా ప్రేక్షకులకు తెలిసేలా నోట్ ద్వారా చెప్పాలని క్లారిటీ ఇచ్చింది.
నటీనటుల వాయిస్, రూపాన్ని ఏఐతో మార్చితే ఆ వివరాలు మెన్షన్ చేయాలని పేర్కొంది. అంటే మద్యపానం, దూమపానం గమనిక వేసినట్లుగా అన్నమాట. అలాగే యాక్టింగ్లో ఎంట్రీ పొందాలంటే ఏఐ ఉపయోగించిన సన్నివేశాల కంటే మాములు వాటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. నటీనటుల యాక్టింగ్కు ఏఐ అదనపు మెరుగులు దిద్దినప్పటికీ వారి నటననే ప్రధానంగా తీసుకోనున్నట్లు తెలిపింది. అనుమతులు లేకుండా ఎవరిదైనా వాయిస్, రూపాన్ని ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టం చేసింది.
ఇక దర్శకత్వం, రచన, సంగీతం, యానిమేషన్ విభాగాల్లోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఏఐ కేవలం సహయం కోసం ఉండాలే కానీ, దానికే అధిక ప్రాధాన్యం ఉండకూడదనేది తమ ఉద్దేశమని గోల్డెన్ గ్లోబ్స్ నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ వేడుక జరగనుంది. కాలిఫోర్నియాలోని బీవర్లీ హిల్స్లో ఉన్న ది బీవర్లీ హిల్టన్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది..