‘సింగ్ గీతం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వచ్చినప్పుడు.. ఈ వయసులో సింగీతం సినిమా తీశారా చాలా గ్రేట్ అని అంతా అనుకున్నారు. నిజంగానే ఆయన చాలా గ్రేట్ కూడా. అయితే ఈ క్రమంలో చర్చకొచ్చిన మరో అంశం.. ఇంత వయసులో ఆయన సినిమా ఎలా తీశారు అని. దానికి సమాధానం ఆయనే ఇటీవల చెప్పుకొచ్చారు. ‘సింగ్ గీతం’ సినిమా విడుదలై భారీ విజయం అందుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ఫోన్ కాల్లో మాట్లాడి ఆసక్తికర విషయం ఒకటి చెప్పుకొచ్చారు.
ఏదైనా కొత్తగా చేయాలి, ఎవరూ చేయని పని చేయాలి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలి అనే ఆలోచన ఎప్పుడూ నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చిందన్న సింగీతం.. తాను చేసిన ప్రతి ప్రయోగం వెనక కొత్తదనం కోసం వెతకడం ఆగలేదని చెప్పారు. సినిమాలో పాటలు వేర్వేరుగా కాకుండా మొత్తం కథని పాటల రూపంలో చెప్పాలనుకున్నాను. నటులు మాట్లాడకుండా పాడుతూ కథని నడిపించడం అనే ఆలోచనే ‘సింగ్ గీతం’ సినిమాకు జీవం పోసిందని చెప్పారు.
40 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచన ఇన్నాళ్లుగా తన దగ్గరే ఉందని.. చివరికి నాగ్ అశ్విన్ దృష్టికి వెళ్లిందని చెప్పారు. తన వయసు దృష్ట్యా సాంకేతిక సహకారంతో ఆన్లైన్లో ఈ సినిమాను తెరకెక్కించేలా నాగ్ అశ్విన్ ఏర్పాట్లు చేశారని చెప్పారు. హోమ్ థియేటర్లో కూర్చుని షూటింగ్ లొకేషన్లో జరుగుతున్న ప్రతి విషయాన్నీ చూస్తూ నటీనటులకు సూచనలు ఇచ్చేవాడినని చెప్పారు. అలా ఇంటి నుంచే సినిమాకి దర్శకత్వం వహించా అని చెప్పారు సింగీతం. అంటే షూటింగ్ ఫ్రమ్ హోం అన్నమాట.
ఈ లెక్కన సింగీతం శ్రీనివాసరావు కలల స్క్రిప్ట్ను సినిమాగా తీయడానికి నాగ్ అశ్విన్ చేసిన ప్రయత్నం ఇదన్నమాట. గురువులా భావించే సింగీతం కోసం నాగ్ అశ్విన్ ఎంత కష్టపడ్డారో కదా. నాగీ అంతే.. చాలా స్పెషల్ అని టాలీవుడ్లో ఎందుకంటారో మరోసారి తెలిసింది.