Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

ప్రముఖ కథానాయకుడు మహేష్‌ బాబు (Mahesh Babu) మరో ట్రిప్‌కు సిద్ధమయ్యారు. అయితే ఎప్పటిలా తన కుటుంబంతో కాకుండా సినిమా టీమ్‌తో వెళ్లనున్నారు. ఈ మేరకు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేశ్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇంతవరకు ఏ అధికారిక ప్రకటనా వెలువడనప్పటికీ షూటింగ్‌ సాగిపోతూనే ఉంది. హైదరాబాద్‌లో ఇన్నాళ్లూగా చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట.

Mahesh Babu

చాలా రోజులుగా వస్తున్న పుకార్ల ప్రకారం ఈ సినిమాలోని కొంత భాగం ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది. దీని కోసం ఇక్కడే నగరంలో ఏదైనా పెద్ద సెట్‌ వేస్తారు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు నిజంగానే ఆఫ్రికా దేశాల్లో షూటింగ్‌ చేస్తారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కెన్యాలో కీలక షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్లు ప్రచారం సాగినా ఇన్నాళ్లూ టీమ్‌ వెళ్లలేదు. దీంతో ఈ ఆలోచన విరమించుకున్నారేమో అని అనుకున్నారంతా. కానీ ఆ టూర్‌ ఉందట.

అదే ఇప్పుడు రెడీ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్‌ కోసం జులైలో కెన్యాకు పయనమయ్యేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నారట. నెల రోజులకు పైగా సాగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రఖ్యాత అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తోపాటు మరికొందరు ముఖ్య నటులు పాల్గొంటారని సమాచారం.

ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో ఆ నేషనల్‌ పార్క్‌ తరహా సెట్స్‌ రూపొందించి మరికొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారు అని తెలుస్తోంది. ప్రపంచాన్ని చుట్టొచ్చే సాహసికుడు కథగా ఈ సినిమా తెరకెక్కనుందని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ చాలా సందర్బాల్లో చెప్పారు. అన్నట్లు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం ఆర్‌.మాధవన్‌ను తీసుకున్నారు అని టాక్‌ నడిచింది. ఈ షెడ్యూల్‌తో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus