మంచు మనోజ్ కెరీర్ ఇప్పుడు ఆయన కోరుకోని దశలో ఉంది. వరుస సినిమాలు చేసిన ఆయన.. మధ్యలో వివిధ కారణాల వల్ల లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. మధ్యలో కొన్ని సినిమాలు ఓకే చేసుకున్నా, ప్రారంభించినా అవేవీ ముందుకెళ్లలేదు. అయితే ‘భైరవం’ సినిమాతో మల్టీస్టారర్ సినిమా చేశాడు. అయితే ఆ ప్రయత్నం ఇబ్బందికర ఫలితం అందించింది. దీంతో మరోసారి సోలో హీరో ఆలోచన చేశాడు. దీని కోసం చరిత్రను తవ్వుతున్నాడు. మంచు మనోజ్ కొత్త సినిమా ఒకటి త్వరలో సెట్స్పైకి వెళ్లనుందట. మనోజ్ 21వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది.
హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో మనోజ్ ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్ పెట్టారు. హనుమ రెడ్డి యక్కంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ మేరకు సినిమా టీమ్ వివరాలు అనౌన్స్ చేసింది. మనోజ్ సినిమా కెరీర్ మొదలై 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. 1897–1922 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకున్న ఓ విప్లవ వీరుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
కుల వ్యవస్థ ఒత్తిడుల నుండి తిరగబడి, బ్రిటిష్ పాలనపై ఎదురుతిరిగిన ఓ రెబల్ జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని టీమ్ చెప్పింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించే పాత్రలో మనోజ్ కనిపించనున్నాడు. డేవిడ్ రెడ్డి ముఖం కనిపించేలా టైటిల్ను వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ఆ రోజుల్లో లేఖలు, నోటీసులు ఇచ్చే పేపర్ మీద టైటిల్ పెట్టి రిలీజ్ చేయడంతో ఆసక్తికరంగా ఉంది.
ఇక ‘మిరాయ్’ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు. ఇప్పుడు సోలో ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టాడు. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కితే మనోజ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేయడం ఖాయం. చూద్దాం మరి ఎలాంటి సినిమాతో వస్తాడు. అన్నట్లు గతంఓల ‘ఒక్కడు మిగిలాడు’ అంటూ మనోజ్ ఓ చరిత్ర సినిమా తీసి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ఆ కోవలో రెండోది.