జానపద గీతాలతో మొదలైన కెరీర్, ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతోందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం సింగర్ మంగ్లీ గురించి బాగా వినిపిస్తోంది. తన ప్రత్యేకమైన యాస, ఎనర్జీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మంగ్లీ, చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. కానీ గత కొంతకాలంగా ఆమె పేరు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా నుంచి వచ్చిన మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్, చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తితో ముందుకు సాగింది. జానపద పాటలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, టీవీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకుని, తర్వాత సినిమాల్లో అవకాశాలు సాధించేలా చేసింది. విదేశాల్లో జరిగే ఈవెంట్స్లో కూడా ఆమె పాటలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది.
అయితే, ఆమె కెరీర్లో కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. గతంలో జరిగిన బర్త్డే పార్టీ ఘటన, అలాగే ఒక సినిమా పాటపై వచ్చిన విమర్శలు ఆమెను ట్రోలింగ్కు గురి చేశాయి. ఆ సందర్భాల్లో మంగ్లీ తనవైపు నుండి వివరణ ఇచ్చి వివాదాలను సద్దుమణిగించే ప్రయత్నం చేసింది.
ఇప్పుడు తాజాగా పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసం జరిగిందన్న ఆరోపణలు బయటకు రావడంతో మరోసారి చర్చ మొదలైంది. కొందరు బాధితులు భారీ మొత్తాల్లో డబ్బు ఇచ్చామని చెబుతుండగా, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంగ్లీ స్పష్టం చేస్తోంది. తప్పుడు ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తుండగా..
ఏది నిజం, ఏది ఆరోపణ అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. తన గాత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మంగ్లీ, ఇప్పుడు వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలవటం, తన అభిమానులను కలవరపెడుతోంది.