దర్శకులు నటులు కావడం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని వుడ్స్లో చూస్తూనే ఉన్నాం. ఇలా వచ్చినవాళ్లు తిరిగి వెళ్లకుండా నటులుగానే ఉండిపోవడమూ చూశాం. దేవీప్రసాద్, కాశీ విశ్వనాథ్ లాంటి నటులు ఒకప్పుడు దర్శకులే. రెండు పనులు చేస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. మరి ఇలా రెండు పనులు చేస్తారో లేక నటుడిగా మాత్రమే ఉండిపోతారో తెలియదు కానీ.. మరో దర్శకుడు ఇప్పుడు మరోసారి నటుడి అవతారం ఎత్తబోతున్నారు.
ఆయనే.. మెహర్ రమేశ్. తెలుగు సినిమాలో ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ తప్ప అందరి హీరోల ఫ్యాన్స్ బాబోయ్ అంటారు. ఎందుకంటే స్టార్ హీరోలు అందరికీ రాడ్ రంబోలా లాంటి సినిమాలు ఇచ్చారు ఆయన. అయితే ఆయన దర్శకుడిగా మారిన నటుడు అని కొంతమందికే తెలుసు. మహేష్బాబు సినిమా ‘బాబి’లో మెహర్ రమేశ్ నటుడిగా కనిపించారు. ఎప్పుడూ మహేష్ పక్కనే పాత్ర అది. అయితే ఏమైందో ఏమో 2004లో ‘ఆంధ్రావాలా’ కన్నడ రీమేక్ (వీర కన్నడిగ) తర్వాత మళ్లీ నటనవైపు రాలేదు.
అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నారట. ఓ సినిమాలో మెహర్ రమేశ్ నటిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది అని సమాచారం. త్వరలోనే ఈ విషయం చెబుతారట. మరి నటనపై సీరియస్గా దృష్టి పెట్టి ఈ సినిమా చేస్తున్నారో లేక ఏదో సరదాకి చేస్తున్నారో తెలియాల్సి ఉంది. అలా అని పూర్తిగా నటనవైపు వచ్చేయాలని ఆయన అనుకోవడం లేదట. దర్శకుడిగా ఆయన ప్రయత్నాలు ఆపలేదని టాక్.
దర్శకుడిగా ఆయన ఆఖరిగా 2023లో ‘భోళా శంకర్’ అనే సినిమా చిరంజీవితో తీశారు. అజిత్ ‘వేదాళం’ సినిమాకు రీమేక్ ఇది. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన ఇంకా ఏ సినిమా తీయలేదు. ఓ కథ రెడీ చేసుకొని, హీరోని ఒప్పించే పనిలో ఉన్నారట.