రామ్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అధికారికంగా సినిమాను అనౌన్స్ చేసింది టీమ్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న హీరోయిన్ పేరుకు బదులు కొత్త పేరు చర్చలోకి వచ్చింది. కుర్రకారు లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ కయాదు లోహర్ను ఈ సినిమాలో భాగం చేసేందుకు చిత్రబృందం ప్లాన్స్ చేస్తోందట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ మేరకు ఓ పోస్టర్ చిత్రబృందం నుండి వస్తుంది.
రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని (రామ్ సోదరుడు) నిర్మిస్తున్న ఈ సినిమా.. స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందనుంది. ఈ సినిమాలో వీర అనే యువకుడిగా రామ్ కనిపిస్తాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి పేరు ఇన్ని రోజులు వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్లేస్లోనే కయాదు లోహర్ వస్తోంది అంటున్నారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబరులో విడుదల చేయాలని అనుకుంటున్నాడు రామ్.
ఇక రామ్ మాస్ లవర్ బాయ్గా కెరీర్ స్టార్ట్ చేసి, యాక్షన్ హీరోగా మారి, ఆ తర్వాత క్లాస్ లవర్ బాయ్గా మారి, మధ్యలో ఫ్యామిలీ హీరోగా మారాడు రామ్. తనలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం ఇటీవల స్టార్ట్ చేశాడు. కొన్నేళ్ల క్రితం సాయి ధరమ్ తేజ్ సినిమా ‘రేయ్’కి నరేటర్గా చేశాడు. ఆ తర్వాత ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో ‘ఐడియా చెప్పు ఫ్రెండు..’ అనే పాట పాడాడు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో ‘నువ్వుంటే చాలే..’ అనే పాట రాశాడు. అదే సినిమాలో ‘పప్పీ షేమ్..’, ‘పాడు పాడు..’ అనే పాటలు పాడిన విషయం తెలిసిందే. అలాగే 11 ఏళ్ల వయసులో ‘ఆడయాళం’ అనే షార్ట్ ఫిలింలో నటించి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు.