‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల తర్వాత కొంతమంది చూపు పడింది. ఆమె ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఆమె మీద దృష్టి పెడుతున్నారు. ఎందుకు, ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకు తెలిసే ఉంటుంది. అలాంటి సమయంలో ఆమె ఇటీవల భీమవరంలో జరిగిన ఈవెంట్కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం చర్చకు దారి తీసింది. ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడేస్తున్నారు అంటూ ఇటు నిధి అగర్వాల్ను, అటు జనసేన పార్టీని, ఇంకోవైపు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బోర్డు ఉన్న వాహనం నుండి నిధి అగర్వాల్ దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే అధికారులు, నాయకులు మాత్రమే ఆ వాహనాలను వినియోగించే అధికారం ఉంటుంది. అంతేకాదు ఆ అధికారులు సొంత పనుల కోసం కూడా వాటిని వాడటానికి వీల్లేదు. కానీ ప్రభుత్వంతో సంబంధం లేని నిధి అధికారిక వాహనంలో రావడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ క్రమంలో ఆమె స్పందించింది.
భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు జరిగిన పరిణామాలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఆ ఈవెంట్ నిర్వాహకులు నా కోసం పంపించిన కారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. ఈ ఏర్పాటు విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు వచ్చిన వార్తలు తప్పు. నా అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. అందుకే వివరాలు తెలియజేస్తున్నా అని నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
మరోవైపు విజయవాడలో ట్రావెల్స్ వాహనాల దందా పెరిగిపోతోంది. ప్రభుత్వ వాహనాల ప్లేట్స్తో రోడ్లపైకి వస్తున్నాయి. నిధి అగర్వాల్ ఉదంతంలో కూడా ఇలాంటి పనే జరిగింది అని తెలుస్తోంది. తన కారుకు ప్రభుత్వ వాహనం ప్లేట్ పెట్టుకున్న మాట వాస్తవమేనని ఆ కారు నడిపిన డ్రైవర్ అంగీకరించాడు. తప్పు చేశానని అంగీకరిస్తూ వీడియో కూడా విడుదల చేశాడు. నిధి అగర్వాల్ను ఎయిర్పోర్ట్ నుండి నోవాటెల్కు తీసుకెళ్లానని చెప్పాడు.