ఒక సినిమా హిట్ అయినప్పుడు నిర్మాతలు ఒకసారి సక్సెస్ మీట్, హీరో – టెక్నీషియన్లు వేర్వేరుగా ప్రెస్ మీట్ పెట్టడం ఎప్పుడైనా చూశారా. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఇలాంటి పరిస్థితి అయితే మాకు తెలిసి ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు జరిగింది. ఆ అవకాశం టాలీవుడ్కి ఇచ్చింది ‘అఖండ 2: తాండవం’. కావాలంటే మీరే గమనించండి. వివిధ ఇబ్బందులతో వాయిదా పడి ఈ నెల 12న ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదలయ్యాక నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఓ ప్రెస్ మీట్ పెట్టారు. తమ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
సినిమా విడుదలైన వెంటనే తమ ఆనందాన్ని చెప్పడానికి వచ్చారు.. అందుకే నటులు, టెక్నీషియన్లు రాలేదేమో అనుకున్నారంతా. కట్ చేస్తే ఆదివారం (డిసెంబరు 14న) సినిమా టీమ్ ‘అఖండ భారత్ బ్లాక్ బస్టర్’ అంటూ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సినిమాలో నటించిన ముఖ్య నటులు, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బోయపాటి శ్రీను.. సినిమాను కొన్ని ప్రాంతాల్లో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు, మరికొంతమంది ఆప్తులు వచ్చారు. సినిమా గురించి, సినిమా సాధించిన విజయం గురించి మాట్లాడారు.
బాలయ్య మైక్ అందుకున్నాక మాట్లాడుతూ ఈ సినిమా సాధించిన విజయం గురించి, తన మీద వచ్చిన కొన్ని విమర్శల గురించి అన్యాపదేశంగా కౌంటర్ ఇచ్చారు. సినిమాలో నటించిన వారందరి గురించి, దర్శకుడు బోయపాటి గురించి, సంగీత దర్శకుడు తమన్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. వారు సినిమా కోసం పడ్డ కష్టం గురించి కూడా మాట్లాడారు. అలాగే సినిమా ఆలస్యమవ్వడం గురించి ఇన్డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. ఇన్ని మాట్లాడిన బాలయ్య నిర్మాతల గురించి మాట్లాడలేదు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్లో నిర్మాతలు కూడా కనిపించలేదు. స్టేజీ మీదకు ఎక్కడి మాట్లాడింది లేదు. సినిమా విడుదల ముందు రాలేదంటే.. రిలీజ్ బిజీలో ఉన్నారు అనుకోవచ్చు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఈవెంట్కి రాకపోవడం ఏంటో తెలియడం లేదు.