టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలు వాయిదా పడటం అనేది ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. భారీ అంచనాలతో విడుదల తేదీలను ప్రకటించడం, తీరా సమయం దగ్గరపడేసరికి వాయిదా వేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు ఇదే బాటలో నడిచాయి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ చిత్రం చాలా నెలల క్రితమే మొదలైనా, అనుకున్న సమయానికి షూటింగ్ షెడ్యూల్స్ మొదలుకాకపోవడం, మొదలైనవి పూర్తికాకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను ఏకంగా ఏడాది పాటు వాయిదా వేస్తూ, వచ్చే ఏడాది జూన్లో విడుదల చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. షూటింగ్ కీలక దశలో ఉందని చెబుతూనే, ఇంత సుదీర్ఘ కాలం వాయిదా వేయడం వెనుక కారణాలేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల జాప్యం కారణంగా ఈ సినిమా విడుదలపై స్పష్టత కరువైంది. అయితే, ప్రశాంత్ నీల్ సినిమా ఆలస్యం అవ్వడం కేవలం తారక్ అభిమానులనే కాకుండా, దర్శకుడు కొరటాల శివను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ‘దేవర’ ఘనవిజయం సాధించిన తర్వాత సీక్వెల్ కూడా చేస్తారని త్వరలోనే ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ వేరే ఆలోచన చేసి ప్రశాంత నీల్ కు అవకాశం ఇచ్చారు.
దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును పూర్తి చేసి రావాలి. అప్పుడే దేవర-2 ప్రారంభమవుతుంది. ఇప్పుడు నీల్ సినిమా ఏడాది వాయిదా పడటంతో, ‘దేవర-2’ పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మధ్యలో కొరటాల శివ వేరే హీరోతో సినిమా చేసే ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు. పెద్ద సినిమాల నిర్మాణంలో నాణ్యత ముఖ్యం అయినప్పటికీ, ఇలాంటి వాయిదాలు ఇండస్ట్రీపై, హీరోల డేట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.