జూనియర్ ఎన్టీఆర్ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ భారీ మోసం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. జూలై 18వ తేదీన ‘ఊరు – వాడ’ అనే సేవా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తున్నట్టు కొందరు తెగ ప్రచారం చేశారు. ‘రా – ఎన్టీఆర్'(NTR) పేరుతో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ను అనౌన్స్ చేసి.. దానికి ఒక వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇది నిజమని తెలీక సామాన్య ప్రజలు, నందమూరి అభిమానులు విరాళాలు సమర్పించేందుకు, సేకరించేందుకు కూడా రెడీ అయిపోయారు.
ఈ ‘ఊరు – వాడ’ కార్యక్రమం పూర్తిగా ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతోందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ త్వరలో రాజకీయ అరంగేట్రం చేసేందుకు నిశ్చయించుకున్నారని, అందులో భాగంగానే ప్రజా సేవ కోసం ఏకంగా వంద కోట్లు ఖర్చు చేయబోతున్నారని కట్టుకథలు సృష్టించి హడావిడి చేశారు. అయితే ‘రా – ఎన్టీఆర్’ కి ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేస్తూ ఓ లేఖని విడుదల చేసింది.
నకిలీ కార్యకలాపాలపై ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తడంతో జూనియర్ ఎన్టీఆర్ బృందం అలర్ట్ అయ్యింది. ఆ సంస్థతో కానీ, వారి వెబ్ సైట్ తో కానీ జూ.ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా గుర్తుతెలీని వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నదని, దయచేసి ఇలాంటివి నమ్మి మోసపోవొద్దని అందులో పేర్కొన్నారు. అయితే దాదాపు 12 గంటల నుండి ఆ వార్త ప్రచారంలో ఉంటే.. ఎన్టీఆర్ టీం ఇంత ఆలస్యంగా రియాక్ట్ అవ్వడం ఏంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో టీం ఉంది.. అతని గురించి ఏ చిన్న వార్త వచ్చినా.. ఎన్టీఆర్ కి తెలిపి.. వాస్తవాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత ఎన్టీఆర్ టీమ్ పై ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఈ రకంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.