రోజూ సెట్‌కి రావడం ఉత్సాహంగా అనిపించేది – పూజా హెగ్డే

  • June 8, 2018 / 06:12 AM IST

జై లవ కుశ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ శివారులలో విజయవంతంగా పూర్తి అయింది. యాక్షన్ సీన్ చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో సాగుతుంది. నాలుగు కోట్లతో నిర్మించిన రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన సెట్ లో నెలరోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో దాదాపు చిత్రంలోని నటీనటులందరూ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే పాత్ర చిత్రీకరణ నిన్నటితో పూర్తి అయింది. ఈ విషయాన్నీ జిగేల్ రాణి స్వయంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. ‘ ‘అరవింద సమేత’ చిత్రీకరణలో నా షెడ్యూల్‌ పూర్తైంది. రోజూ సెట్‌కి రావడం చాలా ఉత్సాహంగా అనిపించేది. తారక్‌.. నువ్వు మిస్సయ్యావ్‌.

మరోసారి కలిసి ఫొటో దిగుదాం” అని ట్వీట్‌లో పేర్కొంది. పాటల చిత్రీకరణలో మళ్ళీ పూజా యూనిట్ తో జాయిన్ కానుంది. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ కి పూజా తో రొమాన్స్ కంటే.. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. జగపతిబాబు ఎన్టీఆర్ కి రెండోసారి విలన్ గా నటిస్తున్న ఈ మూవీకోసం ఎస్.ఎస్. థమన్ అదిరే పాటలను అందించే పనిలో ఉన్నారు. తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus