హ్యాపీ వెడ్డింగ్ నిర్మాణంలో ప్రభాస్ హస్తం

  • July 2, 2018 / 07:31 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వర్షం సినిమా ద్వారా హీరోగా నిలబడ్డారు. ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో పౌర్ణమి వచ్చింది. ఇది నిరాశపరిచింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అప్పటికి ఇప్పటికీ ప్రభాస్ రేంజ్ పెరిగితే .. ఎం ఎస్ రాజు మాత్రం వరుస ప్లాప్ లతో సినిమా నిర్మాణానికి దూరమయ్యారు. అయినా ప్రభాస్ తనకి తొలి హిట్ ఇచ్చిన నిర్మాతను మరిచిపోలేదు. కొడుకులను హీరోగా నిలబెట్టాలని రాజు తపనను గుర్తించి అందుకు సాయంగా నిలిచారు. సుమంత్ అశ్విన్‌ హీరోగా యువ డైరక్టర్ లక్ష్మన్ కార్య “హ్యాపీ వెడ్డింగ్” అనే సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్ చూసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. చిత్ర యూనిట్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించాలని తన మిత్రులు వంశీ, ప్రమోద్ లకు ప్రభాస్ చెప్పిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది చిన్న సినిమా అయినప్పటికీ ప్రచారం కోసమే కోటి ముప్పై లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. తప్పకుండా ఈ సినిమా హిట్ కావాలని, ప్రతి ఒక్కరికీ ఈ సినిమా గురించి తెలియాలని వంశీ, ప్రమోద్ లకు ప్రభాస్ ప్రత్యేకంగా చెప్పారంట. అందుకే వారు ఖర్చుకు వెనుకాడడం లేదు. మరి వచ్చే నెలలో థియేటర్లోకి రానున్న మూవీ ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus