పరుశరాముడు అవతారం దాల్చిన పరుగు కమిడియన్!

  • November 5, 2016 / 10:33 AM IST

“సార్.. మన పొజిషన్ ఏంటి సార్?” అంటూ ‘పరుగు’ సినిమాలో అల్లు అర్జున్ అండ్ బ్యాచ్ ని అమాయకంగా అడిగిన సప్తగిరి తర్వాతి కాలంలో హాస్యనటుడిగా బాగా బిజీ అయిపోయాడు. తక్కువ కాలంలోనే సినిమాల సంఖ్యతో పాటు పారితోషికం కూడా పెరగడంతో మరో బ్రహ్మానందం అన్న పేరూ సంపాదించుకున్నాడు. సహాయ దర్శకుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి హాస్యనటుడిగా ప్రేక్షకులకుల ముందుకొచ్చిన సప్తగిరి తాజాగా పరుశరాముడి అవతారం దాల్చాడు.కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి తన పేరుతోనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సప్తగిరి ఎక్స్ ప్రెస్ పేరుతో రానున్న ఈ సినిమా త్వరలో తెరమీదికి రానుంది.

ఈమేరకు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కొద్దిరోజుల క్రితం మోషన్ పోస్టర్ విడుదల చేసిన సప్తగిరి అండ్ కో నిన్న డైలాగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో పరుశరాముడి గెటప్ లో దర్శనమిచ్చాడు సప్తగిరి. ఏమాటికామాటే చెప్పుకోవాలి. ఆ గెటప్ లో సప్తగిరి భలే ఉన్నాడు. “శివ ధనుర్బంగ దోషి అయిన నీ కుమారుణ్ని రమ్మను” అంటూసాగే ఓ డైలాగ్ కూడా అద్భుతంగా చెప్పాడు మన ప్రభు ప్రసాద్. పేరు తప్పు పడిందనుకునేరు.. సప్తగిరి అసలు పేరు అదే. న్యూమరాలజీ ప్రకారం సప్తగిరిగా మార్చుకున్నాడు. ‘బెస్ట్ యాక్టర్స్’తో దర్శకుడిగా మారిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అరుణ్ పవార్ ఈ సినిమాకి దర్శకుడు. వీరిద్దరికీ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి! అన్నట్టు ఈ సినిమా పాటలు నవంబర్ 7న పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus