సినిమా రిలీజ్కి ముందు అందులోని పాటలను రిలీజ్ చేసి ప్రచారం చేయడం మనం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. క్యాసెట్లు, సీడీలు ఉన్నప్పుడు అవే ప్రచార సారధులుగా ఉండేవి. ఆ తర్వాత క్యాసెట్లు, సీడీ గతం అయిపోవడంతో ఇప్పుడు సింగిల్స్ పేరిట యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో పాటలకు పెద్దగా అవకాశం లేకపోతే ప్రమోషనల్ సాంగ్ పేరిట ఓ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టిన సందర్భాలు తక్కువ. ఏదో రాజమౌళి (S. S. Rajamouli) లాంటి వాళ్లు గతంలో చేశారు.
అయితే ఓ ప్రచార గీతం కోసం ఏకంగా రూ.కోటిన్నర ఖర్చు పెట్టారు అంటే నమ్ముతారా? కానీ ‘కుబేర’ సినిమా కోసం ఇది చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. ‘పిప్పిప్పి డుం డుం డుం’ అంటూ ఆ మధ్య ‘కుబేర’ (Kuberaa) సినిమా టీమ్ ఓ సాంగ్ని రిలీజ్ చేసింది. రష్మిక మందన ప్రధానంగా సాగిన ఆ పాటకు మంచి స్పందన కూడా వచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే పాట ఎక్కడా కనిపించలేదు. దీంతో నిడివి కారణంగా తీసేశారేమో అనుకున్నారంతా.
కానీ, సినిమా సక్సెస్ ప్రెస్ మీట్లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మరో మేటర్ చెప్పుకొచ్చారు. సినిమా కోసం ఆ పాటను చిత్రీకరించలేదని.. కేవలం ప్రమోషనల్ సాంగ్గా మాత్రమే రూపొందించాం అని చెప్పారు. ఆ పాటను సినిమాలో పెడితే సమస్య అవుతుంది అనిపించిందని.. అందుకే యాడ్ చేయలేదని చెప్పారు. పాట కోసం వేరే సీన్స్ తొలగించడం సులభం కాదని చెప్పారు.
ఒకవేళ అలా తీసేయగలిగే సీన్స్ ఉంటే.. తనకూ ఇష్టమే అని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula).సినిమా ఫైనల్ కట్లో కొన్ని సన్నివేశాలు తొలగించే పని చేయలేదు. అనుకున్న విధంగా సినిమాని రూపొందించాం. ఇప్పుడు మీరు చూస్తున్న రన్టైమ్కు మరో అరగంట ఎక్కువ ఒరిజినల్ నిడివి ఉంది అని చెప్పారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). ఆ సీన్స్ ఓటీటీ వెర్షన్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని సమాచారం.