మనకేం అవుతుందో మనకు మాత్రమే తెలుస్తుంది – సోనాలి బింద్రే

  • October 9, 2018 / 04:54 PM IST

అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న సోనాలి బింద్రే.. తన భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో గుండె బద్దలయ్యే నిజం తెలిసింది. క్యాన్సర్ మహమ్మారి ప్రాణాలను కబళించడానికి సిద్ధమవుతోందని బయటపడింది. గుండె నిబ్బరం చేసుకొని న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటోంది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలో తన బాధను ఓ లేఖ ద్వారా వెల్లడించింది. “కొన్ని నెలలుగా మంచి, చెడు రెండూ అనుభవిస్తున్నా. చికిత్స జరుగుతుండగా కనీసం నా చేతి వేలు కూడా పైకెత్తలేనంతగా తయారయ్యా. శారీరకంగా మొదలైన ఆ నొప్పి కాస్త మానసికంగా కూడా భాధ పెడుతోంది. కీమో థెరపీ, సర్జరీ జరిగిన తర్వాత కనీసం నవ్వినా కూడా నొప్పి వచ్చేది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తూ గడుపుతున్నా.” అంటూ భావోద్వేగంతో లెటర్ రాసింది. ఇంకా ఆ లేఖలో… “చెడు రోజులు జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తుంటాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

కొన్ని సందర్భాల్లో నొప్పిని భరిస్తూ ఏడ్చేశాను. మనకేం అవుతోందో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని అంగీకరిస్తేనే మంచిది. భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు. కొన్నిసార్లు నెగిటివ్‌ ఎమోషన్స్‌కి లోనుకావడం కూడా తప్పు కాదు. కాకపోతే ఆ తర్వాత దానిని గుర్తించి ఆ ప్రభావం మనపై పడకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. మా అబ్బాయితో మాట్లాడటం, నిద్రపోవటం ద్వారా ఇవన్నీ మర్చిపోయి కాలం గడుపుతున్నా. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. త్వరలో ఇంటికి వచ్చేస్తా” అని గుండుతో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ లేఖ చదివిన నెటిజనులు, అభిమానులు సోనాలి బింద్రేకి మాటలతో దైర్యం ఇస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus