‘శ్రీదేవి’ మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు – డా.టి.సుబ్బరామి రెడ్డి , ఎం.పి

  • February 26, 2018 / 07:32 AM IST

‘శ్రీదేవి’ హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది. నమ్మలేకపోతున్నాను. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు, ఆప్తురాలు. ఎన్నో సినీ వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేవారు. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ‘వేటగాడు,ప్రేమాభిషేకం,జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి ఎన్నో తెలుగు చిత్రాలు బాలీవుడ్ లో యాష్ చోప్రా తాము రూపొందించిన ‘చాందిని, అలాగే లమ్హే’ చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వన్నె తెచ్చాయి. ఆమె కీర్తిని దశ,దిశలా వ్యాపింప చేశాయి. నిన్నగాక మొన్న ‘మామ్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీదేవి హఠాత్తుగా మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదన్నా సన్నివేశం ఇస్తే ఇలా చేయాలా? అలా చేయాలా? అని రిహార్సల్స్‌ చేసుకోకుండా అలా పాత్రను అర్థం చేసుకుని సహజంగానే నటించేస్తారు. అందుకే శ్రీదేవి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయాలేరని అంటుంటారు.

అభిమానుల్లో ఆమెకున్న పేరు అంతా ఇంతా కాదు.బాల నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీదేవి అంచెలంచెలుగా స్టార్‌ కథానాయికగా ఎదిగారు. శ్రీదేవి అప్పటి యువ కథానాయకులతో నటిస్తూనే సీనియర్‌ నటులతోనూ చేసేందుకు ఏమాత్రం సంశయించలేదు. ‘బడి పంతులు’ చిత్రంలో ఎన్టీఆర్‌ మనవరాలిగా చేసిన శ్రీదేవి.. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్‌గా అదరగొట్టేశారు. ఇక ఏఎన్నార్‌తో పలు చిత్రాల్లో నటించిన ఈ ‘అతిలోక సుందరి’ఆ తర్వాతి కాలంలో నాగార్జునతో కూడా నటించడం గమనార్హం. నటనకు వయసు ప్రమాణికం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పారు శ్రీదేవి. తన సినీ కెరీర్‌లో 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె హఠాత్తుగా ఈలోకాన్ని విడిచి వెల్లడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాను భూతిని తెలియ జేస్తున్నాను.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus