Dookudu Movie: మహేష్.. శంకర్ సినిమా వదిలేసుకున్నాడు..శ్రీహరి నో చెప్పాడు..!

  • September 23, 2022 / 05:54 PM IST

‘పోకిరి’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబుకి.. ఆ తర్వాత చేసిన ‘సైనికుడు’ ‘అతిథి’ వంటి చిత్రాలు చేదు ఫలితాలను ఇచ్చాయి. 3 ఏళ్ళ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఖలేజా’ కూడా ప్లాప్ అయ్యింది. దీంతో మహేష్ పని ఇక అయిపోయింది అనే విమర్శలు ఎక్కువయ్యాయి.’ ‘పోకిరి’ ఒక లాటరీ హిట్’ అనే కామెంట్లు కూడా వినిపించాయి. ఒకవేళ అది నిజంగా లాటరీ హిట్ అయితే అన్ని భాషల్లో రీమేక్ చేసినప్పుడు ఎందుకు హిట్ అయ్యింది అనే ఆలోచన కూడా లేకుండా ఆ టైంలో ఓ రేంజ్లో మహేష్ పై విరుచుకుపడ్డారు.

అదే టైంలో శ్రీను వైట్ల తో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు ఆ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. ఎప్పుడైతే ‘దూకుడు’ నుండి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యిందో అప్పటి నుండి అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. ట్రైలర్, పాటలు ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడేలా చేసాయి. సెప్టెంబర్ 23న విడుదలైన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈరోజు ఈ చిత్రం రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ‘దూకుడు’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి :

1) ‘కింగ్’ సినిమా రిలీజ్ అయిన టైంలో మహేష్ సోదరి మంజుల గారు శ్రీను వైట్లకి తన బ్యానర్ తరపున అడ్వాన్స్ ఇచ్చి మంచి స్క్రిప్ట్ రెడీ చేయమన్నారు. హీరోగా మహేష్ ని ఫిక్స్ అయ్యారు. ఆ టైంలో శ్రీను వైట్ల ‘నమో వెంకటేశ’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

2) ‘ఖలేజా’ టైంలోనే మహేష్ ను శ్రీను వైట్ల కలిసి ఓ కథ వినిపించారు. అది బాగుంది అనుకున్నారు. అటు తర్వాత ‘రంగ్ దే బసంతి’ స్టైల్లో ఓ పీరియాడిక్ డ్రామాని కూడా అనుకున్నారు. ఈ రెండు కథలు ఫైనల్ అవ్వలేదు.

3) ఆ టైంలో మాస్ లీడర్ పి.జె.ఆర్ గారి స్ఫూర్తితో దూకుడు లైన్ ను అనుకున్నారు శ్రీను వైట్ల. రైటర్ గోపి మోహన్ తో కలిసి స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డారు. అలా ‘దూకుడు’ స్క్రిప్ట్ ను పూర్తి చేసి మహేష్ కు వినిపించగా అతను ఇంప్రెస్ అయిపోయి వెంటనే డేట్స్ ఇచ్చేసాడు.

4) అయితే మంజుల నిర్మించాల్సిన ఈ సినిమా ’14 రీల్స్’ వారికి వెళ్ళింది. మహేష్ అన్నయ్య దివంగత నటుడు, నిర్మాత అయిన ఘట్టమనేని రమేష్ బాబు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు.

5) హీరోయిన్ గా ఒక్క సినిమా అనుభవం ఉన్న సమంతనే ఫైనల్ చేశారు. అప్పటికి ‘బృందావనం’ సినిమా రిలీజ్ అయినా అందులో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. ‘దూకుడు’ చిత్రం సమంత కి బాగా ప్లస్ అయ్యింది.

6) సంగీత దర్శకుడిగా మొదట ఏ.ఆర్.రెహమాన్, దేవి శ్రీ ప్రసాద్ లను అనుకున్నారు. మంజుల నిర్మాణంలో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించాడు. అలాగే శ్రీను వైట్ల తెరకెక్కించిన చాలా సినిమాలకు దేవి సంగీత దర్శకుడు. అయితే వీరిద్దరినీ కాదు అని తమన్ ను ఫైనల్ చేశారు.

7) ‘దూకుడు’ చిత్రాన్ని మొత్తంగా 135 రోజుల్లో ఫినిష్ చేశారు. టాకీ పార్ట్ ను 45 రోజుల్లో.. యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ ను 90 రోజుల్లో చిత్రీకరించారు.

8) ‘దూకుడు’ లో మహేష్ బాబు చేసిన అజయ్, ఎం.ఎల్.ఎ అజయ్ కుమార్, బళ్లారి బాబు పాత్రలకు ‘కింగ్’ సినిమాలోని నాగార్జున చేసిన 3 పాత్రలు ఇన్స్పిరేషన్.

9) ‘దూకుడు’ లో హీరో తండ్రి పాత్రకు మొదట శ్రీహరి ని అడిగారట. కానీ ఆ టైంకి ఫాదర్ రోల్ చేయడం ఇష్టం లేక నొ చెప్పారట. అయినా ఈ ప్రాజెక్టుని వదులుకోలేక బ్రదర్ రోల్ గా మారిస్తే చేస్తాను అని చెప్పారట. శ్రీహరి కోసం కథ మార్చే వీలు లేక మహేష్ సూచన మేరకు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నాడట శ్రీను వైట్ల.

10) ‘దూకుడు’ చిత్రం కోసం మహేష్ … శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘త్రీ ఇడియట్స్’ రీమేక్ ను వదులుకున్నాడట.

11) కెమెరా మెన్ గా మొదట ప్రసాద్ మూరెళ్ళ ని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల గుహన్ ను రీప్లేస్ చేశారు.

12) ఈ చిత్రంలో మొదట మందు సీన్ లేదు. కానీ మహేష్ కోరిక మేరకు ఆ సీన్ ను కూడా పెట్టాడు శ్రీను వైట్ల.

13) ‘కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు… దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అనే డైలాగ్ ‘దుబాయ్ శీను’ కోసం శ్రీను వైట్ల రాసుకున్నాడట. కానీ ఎడిటింగ్ లో భాగంగా ఆ సినిమాలో ఓ సన్నివేశం తీసేస్తే.. అదే డైలాగ్ ను ‘దూకుడు’ లో పెట్టాడట దర్శకుడు శ్రీను వైట్ల

14) షూటింగ్ సమయంలో కొన్ని అవాంతరాలు రావడంతో నిర్మాతలకు ఫైనల్ గా రూ.2 కోట్ల బడ్జెట్ పెరిగింది.

15) ‘దూకుడు’ సూపర్ హిట్ అవ్వడంతో తమిళ్ లో అజిత్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. శ్రీను వైట్లనే డైరెక్షన్ చేయమన్నారు. కానీ ఎన్టీఆర్ తో ‘బాద్ షా’ చేస్తూ శ్రీను వైట్ల బిజీగా ఉండటం, అలాగే తమిళ్ లాంగ్వేజ్ పై కూడా తనకు పట్టు లేకపోవడం వల్ల చేయలేకపోయాడట.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus