100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో మంది హరోయిన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ వారిలో కొందరు మాత్రమే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కథానాయకలంటే అందాల ఆరబోతకే పరిమితం కాదని మంచి పాత్ర దొరికితే హీరోలు కూడా తమ ముందు బలాదూర్ అని నిరూపించిన వారెందరో. ఇలాంటి వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈ కోవకే వస్తారు మధుబాల. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధ పడిన ఈ నట దిగ్గజం..
తన అనారోగ్యాన్ని అధిగమించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. 14 ఫిబ్రవరి 1933 లో ఢిల్లీలో జన్మించిన మధుబాల (Madhubala) అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగమ్ దహల్వీ. ఆమెకు 8 ఏళ్ల వయసున్నప్పుడే వీరి కుటుంబం ముంబైకి వలస వచ్చింది. మొత్తం 9 మంది తోబుట్టువుల్లో నలుగురు శిశువులుగా ఉన్నప్పుడే మరణించగా మరో ఐదుగురు మాత్రమే మధుబాలతో కలిసి జీవించారు. దురదృష్టవశాత్తూ ఆమె పుట్టుకతోనే వెంట్రిక్యూర్ సెప్టాల్ డిఫెక్ట్ అనే గుండె సంబంధిత అనారోగ్యం ఉంది.
ఆ సమయంలో దీనికి చికిత్స లేదు. 1942లో ‘బాంబే టాకీస్’ అనే సినిమాలో బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన మధుబాల.. ఆ తర్వాత హీరోయిన్గా మారి ‘నీల్ కమల్’ ‘అమర్ మహాల్’ ‘బాదల్’ ‘తారన’ ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ ‘హాఫ్ టికెట్’ ‘హౌరా బ్రిడ్జ్’ ‘కాలా పానీ’ ‘మొగల్ ఏ ఆజాం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్తో అగ్ర కథానాయికగా, ఆ సమయంలో దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నిలిచారు. సినీరంగంలోని ఆకర్షణలకు మధుబాల (Madhubala) కూడా అతీతం కాదు.
అపూర్వ సౌందర్యరాశియైన మధుబాలను దక్కించుకోవాలని ఎంతోమంది ఆశపడ్డారు. అయితే బాలీవుడ్ సూపర్స్టార్ దిలీప్ కుమార్ను ఆమె పెళ్లాడాలని అనుకున్నారు. కానీ అనూహ్య కారణాలతో వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత స్టార్ సింగర్ కిషోర్ కుమార్తో ప్రేమలో పడిన మధుబాల ఆయనను పెళ్లాడారు. ఈ క్రమంలో 1969 నాటికి ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
1969 ఫిబ్రవరి 22 అర్ధరాత్రి మధుబాలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మృత్యువుతో కొద్ది గంటలు పోరాడిన మధుబాల ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చనిపోయే నాటికి ఆమె వయసు 36 ఏళ్లు మాత్రమే. మానవతావాది అయిన మధుబాల (Madhubala) తన సంపాదనలో ఎక్కువ భాగం దానధర్మాల కొరకు వినియోగించారు.