తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి పెద్ద కూతురు

  • September 26, 2018 / 05:57 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి తన తొలి సినిమా “దఢక్”తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇందులో జాన్వి నటనను విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరి ఔరా అనిపించింది. తొలి అడుగు విజయవంతంకావడంతో జాన్వీకి సహజంగానే ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే జాన్వీ మాత్రం తన తల్లికి వీరాభిమానులు ఎక్కువగా ఉన్న దక్షిణాదిన సినిమా చేయాలనీ ఆశపడుతోందని సమాచారం. వాస్తవానికి తెలుగులోనే జాన్వీ ని ఎంట్రీ ఇవ్వాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేశారు. బోనీ కపూర్ మాత్రం బాలీవుడ్ లోనే ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ కావడంతో వెనక్కి తగ్గారు. అక్కడ ఎంట్రీ సక్సస్ కావడంతో.. ఇక్కడ పరిచయం చేయడానికి బోనీ కథలను పరిశీలిస్తున్నారు.

కథ మాత్రమే కాదు, డైరక్టర్, నిర్మాణ సంస్థ, హీరో కూడా ముఖ్యమని ఆలోచిస్తున్నారు. అందుకే ఇద్దరు తమిళ దర్శకులతో పాటు ఓ తెలుగు దర్శకుడితో చర్చలు జరుపుతున్నారు. తెలుగులో తమిళంలో ఒకేసారి కూతురు ఎంట్రీ ఇస్తే చూడాలని బోనీ కోరుకుంటున్నారు. అందుకే ద్విభాషా చిత్రానికి ఒకే చెప్పనున్నట్లు తెలిసింది. ఇక వరుస మూడు హిట్లతో క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తో నటింపజేయిస్తే కూతురి ఎంట్రీ బాగుంటుందని బోణీ కపూర్ భావిస్తున్నారు. సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికపై స్పష్టం చేశారు. తెలుగు హీరో విజయ్ దేవరకొండ సరసన నటించవచ్చని ట్వీట్ చేశారు. అధికారిక ప్రకటన వస్తే అటు శ్రీదేవి అభిమానులు, ఇటు విజయ్ దేవరకొండ అభిమానుల ఆనందానికి హద్దులుండవు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus