‘సర్కారు వారి పాట’ ప్రచారం ఎప్పుడు?

  • May 5, 2022 / 12:47 PM IST

సినిమాకు హీరో ప్రచారం ఎప్పుడు మానేస్తారు అంటే… సినిమా మీద అతి భారీ నమ్మకం ఉన్నప్పుడు, లేదంటే సినిమా విజయం కష్టమే అని ముందే తెలిసినప్పుడు. మరి ‘సర్కారు వారి పాట’ విషయంలో మహేష్‌బాబు నమ్మకం ఏంటి?. ఎందుకంటే సినిమా విడుదలకు ఇంకా ఒక వారం మాత్రమే ఉంది. ఈ సమయంలో సూపర్‌ స్టార్‌ హాలీడే ట్రిప్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ప్రచారం ఎప్పుడు సూపర్‌స్టార్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ అడుగుతున్నారు.

పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దానికి మహేష్‌ అందుబాటులో లేడు. ఆ తర్వాత పరశురామ్‌, కీర్తి సురేశ్‌ ఇంటర్వ్యూ రిలీజ్‌ చేశారు. మరోవైపు సినిమా టెక్నికల్‌ టీమ్‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇక జరగాల్సింది, హైప్‌ పెరగాల్సింది అంటే మహేష్‌ ఇంటర్వ్యూతోనే. హీరో చెబితే సినిమాకొచ్చే ప్రచారం చాలా ఎక్కువ. కానీ మహేష్‌ హాలీడే ట్రిప్‌లో ఉండేసరికి అది కుదరడం లేదు.

దీంతో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల తర్వాత మహేష్‌ను లైవ్‌గా చూడొచ్చు అనేది వారి ఆలోచన. అలాంటివారి కోసం ఈ నెల 7 లేదా 8న ఈ యూసఫ్ గుడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం పర్మిషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆ రోజుకు మహేష్‌ సిటీలో ల్యాండ్‌ అయిపోతాడని కూడా అంటున్నారు. ఆయన లేకుండా ఈవెంట్‌ పెడితే అస్సలు ఉపయోగం లేదు.

ఒకవేళ ఈవెంట్‌ జరిగితే ఎవరు చీఫ్‌ గెస్ట్‌గా వస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్‌తో నెక్స్ట్‌ సినిమాలున్న రాజమౌళి, త్రివిక్రమ్‌ గెస్ట్‌లుగా వస్తారు అని అంటున్నారు. వీళ్లు కాకుండా పూరి జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కూడా ఈవెంట్‌కి రావొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈవెంట్ అంటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కచ్చితం అనే టాక్‌ కూడా ఉంది. ఒకవేళ ఇంతమంది వస్తే సూపర్‌స్టార్‌కి సూపర్‌ ప్రచారం పక్కా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus