ఆ సిరీస్లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. మూడుకు మూడు సినిమాలు భారీ స్థాయిలో విజయాలు అందుకున్నవి. అందులో రెండు సినిమాలు రీమేక్ చేసి విజయాలు సాధించారు. అయితే మూడో సినిమాను రీమేక్ చేయడానికి ఆ హీరో ఓకే అవ్వలేదు. కారణాలేంటో తెలియదు కానీ.. సినిమా అయితే చేయలేదు. ఆ సినిమా ‘దృశ్యం 3’ కాగా, ఆ హీరో వెంకటేశ్. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు అంటే.. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతుంది అనే చర్చ మొదలైంది.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దృశ్యం 3’. అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తెలుగులో సరైన ఫలితం అందుకోని ఈ సినిమా మాలీవుడ్లో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా జూన్ 18 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. థియేటర్లలో ఓకే అనిపించుకోని ఈ సినిమాను తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఏం చేస్తారో చూడాలి.
‘దృశ్యం 2’ ముగిసిన దగ్గరి నుండే మూడో భాగం మొదలవుతుంది. వరుణ్ హత్య కేసును హైకోర్టు కొట్టేయడంతో జార్జ్ కుట్టి (మోహన్ లాల్) కుటుంబానికి ఉపశమనం దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్లు తమ చేదు గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా జీవించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు జార్జ్ తమ కుటుంబ కథను ‘దృశ్యం’ పేరుతో సినిమాగా తీసి నిర్మాతగా భారీ విజయాన్ని అందుకుంటాడు.
మరోవైపు పెద్ద కూతురు అంజు (అన్సీబా హాసన్)కి పెళ్లి చేయాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు జార్జ్ కుట్టి. కుదిరుతున్న ప్రతి సంబంధం ఆఖరి నిమిషంలో వద్దనడంతో జార్జ్లో అనుమానం మొదలవుతుంది. దాని గురించి ఆరా తీయగా తన కుమార్తెకి పెళ్లి కానివ్వకుండా కొంతమంది ఆమెను అరెస్టు చేయించాలని చూస్తున్నారని అర్థమవుతుంది. ఆ కుట్ర చేస్తున్నది ఎవరు? వరుణ్ కుటుంబానికి ఈ విషయంలో సంబంధం ఉందా? ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్ కుట్టి ఏం చేశాడు అన్నదే సినిమా కథ.