మరోసారి టెంపర్ చూపిస్తారా..?

  • September 7, 2016 / 09:35 AM IST

దర్శకుడు పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘ఆంధ్రావాలా’ పరాజయంగా నమోదైంది. అక్కడికి పదేళ్ల తర్వాత వచ్చిన ‘టెంపర్’ ఇద్దరికీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఎన్టీఆర్ కెరీర్ కి కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఎవరు మాట్లాడినా ‘టెంపర్’కి ముందు ‘టెంపర్’ తర్వాత అంటున్నారంటే ఈ సినిమా ఎన్టీఆర్ కి ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ మళ్ళీ పూరితో చేతులు కలుపుతున్నారన్న వార్తా పరిశ్రమ వర్గాలలో వేడి రేపుతోంది.

ఇటీవల ‘జనతా గ్యారేజ్’తో తెరమీదికొచ్చిన ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాతో ‘టెంపర్’ సహా పలు సినిమాలకి కథ అందించిన వక్కంతం వంశీకి దర్శకుడిగా ప్రమోషన్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే పూరి వైపే ఎన్టీఆర్ మొగ్గు చూపుతున్నారట. ఈ సినిమా పూరి కథతోనే తెరకెక్కనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ ఓ సినిమా నిర్మిస్తారన్న మాట కూడా ఈ సినిమాతో నిజమవనుందిట. ప్రస్తుతం పూరి-కళ్యాణ్ రామ్ కలయికలో ‘ఇజం’ విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి మహేశ్, అల్లు అర్జున్ లతో పూరి సినిమా చేయాల్సి వుంది. అయితే వారిద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సెకెన్ల ముల్లుకి కంటే ముందుండే పూరి వారికోసం ఆగుతాడనుకోవటం భ్రమే అవుతుంది. దాంతో ఎన్టీఆర్ – పూరి తాజా సినిమా వార్తకి మరింత బలం చేకూరుతోంది. కొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus