తమిళ టాలెంటెడ్ హీరో సూర్య తెలుగులో కూడా ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్న స్టార్. సూర్య (Suriya) నటించిన చాలా తమిళ సినిమాలు డబ్బింగ్ వర్షన్లో భారీ కలెక్షన్లను సాధించాయి. కానీ ఇప్పటి వరకు కేవలం ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమా మాత్రమే చేశారు. 2010లో వచ్చిన RGV రక్తచరిత్ర 2 తర్వాత మరో స్ట్రైట్ తెలుగు ప్రాజెక్ట్ చేయలేదు. అయితే, ఈ గ్యాప్ని ఇప్పుడు బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. 15 ఏళ్ల తర్వాత సూర్య (Suriya) ఒక తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ కొత్త ప్రాజెక్ట్కి యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) మెగాఫోన్ పట్టబోతున్నట్లు టాక్. వెంకీ అట్లూరి ఇటీవలే లక్కీ భాస్కర్ (Lucky Baskhar)సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. అంతకు ముందు ధనుష్తో (Dhanush) చేసిన సార్ మూవీ కూడా హిట్ అయింది. వరుసగా రెండు సక్సెస్లు అందుకున్న వెంకీకి, ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్కి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగ వంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ముందుగా సూర్య ఇప్పటికే లైనప్ లో ఉన్న కొన్ని సినిమాలను పూర్తిచేయాల్సి ఉంది. ప్రస్తుతం వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో వడివాసల్ చేస్తున్నాడు. అలాగే, కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో రెట్రో (Retro) అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు, ఇది వేసవిలో రిలీజ్ అవ్వనుంది. అటు ఆర్జే బాలాజీతో (RJ Balaji) కూడ మరో సినిమా ఓకే చేశారని సమాచారం. ఇదిలా ఉండగా, సూర్య మరో తెలుగు సినిమా చేయనున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
రీసెంట్గా తండేల్ తో (Thandel) హిట్ కొట్టిన చందూ మొండేటి (Chandoo Mondeti), సూర్యకి ఓ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇది కూడా ఓ పాన్ ఇండియా మూవీగా రూపొందనున్నట్టు టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ (Allu Aravind) ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు. ఒకప్పటి డబ్బింగ్ స్టార్గా తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న సూర్య, ఇప్పుడు స్ట్రైట్ సినిమాలతో కొత్త ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.