మలయాళ నటి అయినప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. రెగ్యులర్ గ్లామర్ రోల్స్ కాకుండా.. కథాప్రాధాన్యత కలిగిన పాత్రలు ఎంపిక చేసుకుంటూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటుంది అనుపమ. ఈరోజు అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా వివరాలు ప్రకటించడం జరిగింది.
త్వరలో ఆమె ఓ పాన్ ఇండియా సినిమాలో భాగం కానుంది. ఆర్జే షాన్ దర్శకత్వం వహిస్తున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్, బెంచ్మార్క్ స్టోరీటెల్లర్స్ సంస్థలపై శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ స్టూడియోతో భాగస్వామ్యంగా ఈ సినిమా నిర్మితమవుతుంది.
గతంలో అనుపమ–షాన్ కాంబినేషన్లో ఓ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. దానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ కాంబోలో ఫీచర్ ఫిలిం రూపుదిద్దుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రేడ్ వర్గాలు సైతం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాయని చెప్పాలి. మేలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. త్వరలోనే సినిమా టైటిల్ను ప్రకటించనున్నారు.
ఇక ‘జటాధర’ వంటి ద్విభాషా చిత్రాన్ని నిర్మించిన ‘ఎస్కేజీ ఎంటర్టైన్మెంట్’ సంస్థ ఇప్పుడు ఎక్స్పాన్షన్ పై దృష్టి పెట్టింది. ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి సక్సెస్ మూవీస్ తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.