తమిళ రాజకీయాల్లో ప్రముఖ కథానాయకుడు విజయ్ జోసెఫ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీని ప్రకటించి, అన్ని స్థానాల్లో గెలిచి, 100కుపైగా స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించాడు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ రాకపోవడంతో కొన్ని ఇబ్బందులు పడి ఫైనల్గా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇదంతా కాకపోయినా ఇందులో కొంతైనా తన విషయంలోనూ జరగాలని ప్రముఖ కథానాయకుడు ధనుష్ అనుకుంటున్నారా? ఆయన చేతలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
తమిళ సినిమా రంగం నుండి రాజకీయాల్లో మరో స్టార్ హీరో ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే తమిళనాడు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆయన ఇటీవల తన అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్. ఆ మాటలు వింటే ధనుష్ రాజకీయాల్లోకి రానున్నాడని కచ్చితంగా అనిపిస్తోంది. అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్ తన అభిమానులు సినిమాల వేడుకలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని పిలుపునిచ్చాడు.
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విజయ్ కూడా గతంలో ఇలాంటి కామెంట్స్ చేశాడని, ఆ తర్వాత తన అభిమానులతో కలసి సేవా కార్యక్రమాలు చేశారని గుర్తుచేసుకుంటున్నారు. మరి నిజంగానే విజయ్ స్టైల్లో ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తాడా? వేచి చూడాల్సిందే.