వింటేజ్ చిరంజీవిని మరోసారి చూసి మురిసిపోయారు ఆయన ఫ్యాన్స్. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయానికి, వసూళ్లకు, వైబ్కి కారణం వింటేజ్ చిరును ప్రచార చిత్రాల్లో చూపించడమే. అనిల్ రావిపూడి వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అయింది. థియేటర్లలో కూడా నాటి చిరంజీవి జోష్ని చూసి ఫ్యాన్స్ మురసిపోయారు. సుమారు రూ.400 కోట్ల భారీ వసూళ్లను అందించి మెగా స్టార్ మీద అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఇలానే మాట్లాడుతున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ట్రైలర్ చూసి చిరంజీవి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. డైలాగులు బాగున్నాయన్నారు. పవన్ అందంగా కనిపించారని ఆనందంగా చెప్పారు. ఆ ఫోన్ పెట్టేశాక నాకు ఓ విషయం అర్థమైంది. చిరంజీవికి పవన్ కల్యాణ్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు లాంటివాడు కూడా అనిపించింది. ప్రతి షాట్ గురించి చెబుతూ చిరు మురిసిపోయారు. నేను చిరంజీవిని చాలాసార్లు కలిశాను. ఆయనతో యాడ్ ఫిల్మ్లు కూడా తీశాను అని హరీశ్ చెప్పారు.
చిరంజీవితో సినిమా ఆలోచన ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఆ సినిమా ప్రాసెస్లో ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి.. సినిమా ఓకే అయితే కచ్చితంగా ‘రౌడీ అల్లుడు’, ‘దొంగ మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమా చేస్తాను అని హరీశ్ నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సినిమా’ విజయం సాధిస్తే.. హరీశ్కు మెగా ఛాన్స్ రావడం పెద్ద విషయమేమీ కాదు. ఎలాగూ చిరంజీవి ఇప్పుడు యంగ్ దర్శకులవైపు చూస్తున్నారు. ఆయనలోని వింటేజ్ వైబ్ను తిరిగి చూపిస్తే బ్లాక్బస్టర్ విజయం పక్కా అని అనిల్ రావిపూడి చేసి చూపించారు కూడా.
హరీశ్ శంకర్ చాలా ఏళ్లుగా నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఆ పని ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఇప్పుడు చిరంజీవి సినిమా చర్చలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హరీశ్ నెక్స్ట్ ఏ ఫ్యాన్స్ని హ్యాపీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.