పాటలు – కాపీరైట్ విషయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అయితే ఆయన ఎవరికైనా నోటీసులు ఇవ్వడం, లేదంటే ఎవరైనా ఆయనకు రిప్లైలు ఇవ్వడం.. ఈ రెండు కాదంటే ఆయన కోర్టుకు వెళ్లడం జరుగుతూ ఉంది. గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాలో ఇదే పరిస్థితి. తాను స్వరపరిచిన పాటలను ఎవరైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే తనకు డబ్బులు చెల్లించాలి అనేది ఆయన మాట.
ఇప్పుడు ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఇతర నిర్మాణ సంస్థల నుండి తమ సంస్థ కాపీరైట్ పొందిన సినిమాల పాటలను వినియోగించాలి అనుకుంటే.. ఇళయరాజా కూడా హక్కు కోరుతున్నారని కోర్టుకు విషయం వెళ్లింది. అంతేకాదు వాటిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నట్లు సరిగమ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గతంలో విచారణ జరిగింది. ఆ మేరకు అప్పుడు స్టే కూడా విధించారు.
అయితే.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇళయరాజా వాణిజ్యపరంగా పాటలను ఉపయోగిస్తున్నట్లు ఇప్పుడు పిటిషన్ దాఖలైంది. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సరిగమ సంస్థ ఆ పిటిషన్లో పేర్కొంది. ఇళయరాజా ఆస్తులను స్వాధీనం చేసుకుని, విక్రయించి వచ్చే నగదుని తమకు ఇవ్వాలని అందులో పేర్కొంది. ఈ పిటిషన్పై జవాబు ఇవ్వాలని ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరి ఈ నోటీసులకు ఆయనేం స్పందిస్తారో చూడాలి.