రెండు ‘బాహుబలి’ సినిమాల్ని కలిపి ఓ పెద్ద ‘బాహుబలి’ని సిద్ధం చేసి ఈ నెల 31న విడుదల చేయనున్నారు. దీని కోసం రాజమౌళి అండ్ కో. గత కొన్ని నెలలుగా ఇదే పనిలో ఉంది. మామూలు సినిమా అయితే అవసరమైతే డిజిటల్ ప్రింట్ను సిద్ధం చేసి.. ఒకవేళ ఉంటే దానిని రీమాస్టర్ చేసి నాణ్యత పెంచి రిలీజ్ చేస్తారు. ఆ లెవల్లో కొంతమంది ప్రచారం కూడా చేస్తారు. కానీ ‘బాహుబలి’ విషయంలో ‘ఎపిక్’ నిర్ణయం తీసుకోవడంతో నిడివి పెద్ద సమస్యగా మారింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కాస్త స్పష్టత వచ్చింది.
థియేటర్లలో ‘బాహుబలి: ది ఎపిక్’ను ఎంత సేపు చూపించాలి అనే విషయంలో చిత్రబృందం నిర్ణయానికి వచ్చి ఎడిట్ టేబుల్ మీద కాపీని సిద్ధం చేసేసిందట. తొలి ‘బాహుబలి’ వచ్చిన పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా రానున్న ఈ ‘ఎపిక్’ సినిమాను 3 గంటల 40 నిమిషాల నిడివితో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా ముగిశాక ఇంటర్వెల్ ఇచ్చి.. తర్వాత ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సమయంలో ఓ పది నిమిషాలు అటు ఇటు అవ్వొచ్చని నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు.
ఈ క్రమంలో సినిమా గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లపై క్లారిటీ కూడా ఇచ్చారు శోభు. బాహుబలి పాత్ర కోసం తొలుత హృతిక్ రోషన్ను అనుకున్నామన్న వార్తల్లో నిజం లేదని తేల్చారు. అలాగే ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ఎండ్ టైటిల్స్లో ‘బాహుబలి 3’ ప్రకటన ఉంటుందనే ప్రచారాన్నీ శోభు ఖండించారు. అయితే ‘బాహుబలి: ది ఎపిక్’లో ఓ సర్ప్రైజ్ మాత్రం ఉంటుందని తెలిపారు. ఇక చాలా రోజులుగా వినిపిస్తున్న ‘బాహుబలి’ డాక్యుమెంటరీ గురించీ ఆయన మాట్లాడారు. ఈ ఏడాది చివరిలో ఓటీటీలో ఆ డాక్యుమెంటరీ వస్తుందని చెప్పారు. ఫైనల్గా తాము పెద్ద ‘బాహుబలి’ని తీసుకొస్తోంది కలెక్షన్ల కోసం కాదని.. ప్రేక్షకులకు ఓ మంచి ఎక్స్పీరియన్స్ కోసమని చెప్పారు.