ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత కథను సినిమాగా తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఆ సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తాడు అంటూ ఓ టీజర్ పోస్టర్ లాంటిది కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా వస్తుందా లేదా అనేది కూడా చెప్పలేదు. ఓవైపు ధనుష్ తన కొత్త సినిమాలు చేసుకుంటూ, అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరోవైపు దర్శకుడు తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. దీంతో ఈ సినిమా టీమ్లో మార్పులు వస్తాయని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది.
ఇళయరాజా బయోపిక్ని అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం రూపొందించనున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి అరుణ్ తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో హీరో ధనుష్ మేనేజర్ ‘ఎక్స్’లో వివరణ ఇచ్చారు. ఇళయరాజా బయోపిక్ నుండి అరుణ్ మాతేశ్వరన్ తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు. ప్రస్తుతం ఆయన ‘డీసీ’ సినిమాతో బిజీగా ఉన్నారు అని ఈ సినిమా ఆలస్యానికి కారణం చెప్పారు..
‘డీసీ’ సినిమా పనులు, విడుదల అయిపోయిన తర్వాత ఇళయరాజా బయోపిక్ సినిమా పనులు ప్రారంభిస్తారని కూడా తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి మరికొన్ని వివరాలను ప్రకటిస్తారని వెల్లడించారు. ధనుష్ – అరుణ్ మాతేశ్వరన్ కాంబినేషన్లో గతంలో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా వచ్చింది. ఇక ధనుష్ ప్రస్తుతం ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్), ‘కర’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు అయిపోయాక ఇళయరాజా సినిమా మొదలుపెడతారు అని చెబుతున్నారు.
ఇక పైన చదివి ‘డీ 55’, ‘కర’ సినిమాల కంటే ముందే ఇళయరాజా బయోపిక్ సినిమా అనౌన్స్ చేశారు. ధనుష్ స్పీడ్ గురించి తెలిసినవాళ్లు ఈ సినిమా త్వరలోనే వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. అందుకే ఈ సినిమా మీద పుకార్లు మొదలయ్యాయి.