ఇటీవల కాంతారా సినిమా దేవుని నృత్యంపై ఇబ్బందికరంగా ప్రవర్తించిన అంశంలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అవార్డు వేడుకలో భాగంగా కాంతార చిత్రాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన హావభావాలు, దేవుని నృత్యాన్ని అనుకరించిన తీరు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయంటూ తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియాలో చర్చకే పరిమితం కాకుండా న్యాయస్థానం వరకూ వెళ్లడం గమనార్హం.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన కర్ణాటక హైకోర్ట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, విచారణకు రణవీర్ సింగ్ పూర్తిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ దశలో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఊరట కల్పించింది. అయితే మతపరమైన లేదా సాంస్కృతిక మనోభావాలను అవమానించే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలియక చేసినా ఇలాంటి చర్యలు సరికాదని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను మార్చి రెండో తేదీకి వాయిదా వేసింది.
గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కాంతారా గురించి మాట్లాడిన రణవీర్, హీరో రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ చేసిన అనుకరణే వివాదానికి కారణమైంది. అనంతరం విమర్శలు తీవ్రం కావడంతో రణవీర్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే, వివాదాల మధ్యన కూడా రణవీర్ సింగ్ తన సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఇటీవల విడుదలైన చిత్రం ధురంధర్ తో పాటు, త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా ఊరట లభించినా, ఈ వివాదం రణవీర్ కెరీర్లో వివాదాస్పదంగా మిగిలిపోయేలా ఉంది.