నేను 39 ఎకరాలిచ్చా… 210 కోట్లు ఇప్పించండి!: అశ్వనీదత్
September 29, 2020 / 01:22 PM IST
|Follow Us
ఏపీ ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి వ్యతిరేకంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఏపీ హైకోర్టుకు వెళ్లారు. ఇద్దరూ వేర్వేరుగా రెండు పిటీషన్లు దాఖలు చేశారు. అసలు పూర్తి వివరాల్లోకి వెళితే… గన్నవరంలో విమానాశ్రయ విస్తరణ కోసం అశ్వినీదత్ 39 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రభుత్వానికి తాను భూమి ఇచ్చినప్పుడు అక్కడ ఎకరా భూమి రూ. 1.84 కోట్లు చేస్తుందనీ, భూసేకరణ చట్టం కింద అంతకు నాలుగురెట్లు తనకు ఇప్పించేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు.
తాను ఇచ్చిన 39 ఎకరాలకు 210 కోట్ల రూపాయలను ఆయన పరిహారంగా కోరుతున్నారు. అమరావతి అది రాజధాని తరలించాలనే నిర్ణయం తీసుకోవడంతో ఎకరం 30 లక్షల రూపాయల విలువ కూడా చెయ్యడం లేదని అశ్వినీదత్ పిటీషన్ లో పేర్కొన్నట్టు సమాచారం. కృష్ణంరాజు పిటీషన్ వివరాలకు వస్తే… గన్నవరం విమానాశ్రయం విస్తరణకు కృష్ణాజిల్లాలోని కేసరపల్లిలో తమ భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుందని ఆయన సతీమణితో కలిసి పిటీషన్ వేశారు.
దీనిపై కౌంటర్ దాఖలు చెయ్యాలని ఏఏఐ, ఏపీ ప్రభుత్వాన్ని పిటీషన్ విచారించిన జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ ఐదో తారీఖుకి వాయిదా వేశారు.