సోషల్ మీడియా ఎవర్ని ఎప్పుడు స్టార్ను చేస్తుందో చెప్పలేం. కుంభమేళాలో పూసలు అమ్ముతూ, తన తేనె కళ్లతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది మోనాలిసా. ఆమెతో ఫోటోల కోసం జనం ఎగబడటం, ఆఖరికి ఆమె ముసుగు వేసుకుని తిరగాల్సి రావడం అంతా చూశాం. మొదట ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తానని ప్రకటించినా, అతను అరెస్ట్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇప్పుడు మోనాలిసా ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. హైదరాబాద్లో ఆమె మొదటి తెలుగు సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఇది చూసిన నెటిజన్లు “మోనాలిసా నక్క తోక తొక్కింది” అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ, ఈ ‘పాన్ ఇండియా’ ప్రాజెక్ట్ వెనుక ఉన్న టీమ్ను చూస్తేనే అసలు విషయం అర్థమవుతోంది.
ఈ సినిమాలో హీరో సాయి చరణ్ (‘ఇట్స్ ఓకే గురు’, ‘క్రష్’ ఫేమ్). ఇక దర్శకుడు శ్రీను కోటపాటి. ఈయన ట్రాక్ రికార్డ్ చూస్తే.. గతంలో ధనాధన్ ధన్రాజ్, తాగుబోతు రమేష్లతో ‘పీకే రావు ఏకే రావు’, ఆ తర్వాత ఆది సాయికుమార్తో ‘లవ్ కే రన్’ వంటి సినిమాలు తీశారు. ఇవి చాలా చిన్న సినిమాలు, ఎప్పుడు వచ్చాయో కూడా చాలా మందికి తెలియదు.
ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు, పెద్దగా ఫామ్లో లేని హీరో.. ఇప్పుడు ఏకంగా “పాన్ ఇండియా” సినిమా (తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం) అనౌన్స్ చేయడం వెనుక అసలు స్ట్రాటజీ వేరేలా ఉంది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఏకైక ‘పాన్ ఇండియా’ అట్రాక్షన్.. మోనాలిసా వైరల్ ఫేమ్ మాత్రమే.
మోనాలిసాకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ను వాడుకుని, సినిమాకు బజ్ తెచ్చుకోవడానికి మేకర్స్ దీన్ని ‘పాన్ ఇండియా’ ప్రాజెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇది మేకర్స్ వేసిన స్మార్ట్ ప్లానే అయినా, కేవలం ఆమె ఫేస్వాల్యూతో ఈ సినిమాను గట్టెక్కిస్తారా, లేక ఇది మరో పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోతుందా అనేది చూడాలి.