సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. రివ్యూలు కూడా ఇస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్బాబు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తాను చూసిన సినిమాలకు రివ్యూ ఇచ్చేస్తుంటాడు. అందుకే ఆయన సోషల్ మీడియా మీద అభిమానులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటారు. ఈ క్రమంలో నేను హాలీవుడ్ సినిమాలు కూడా చూస్తా అంటూ ఓ హాలీవుడ్ ఓటీటీ సినిమాకు రివ్యూ ఇచ్చాడు. దానికి ప్రతిగా ఆ సినిమా హీరోయిన్ ‘వారణాసి’ సినిమా అప్డేట్ లీక్ చేసేసింది. ఇప్పుడు ఈ రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘ది బ్లఫ్’ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. మహేశ్ బాబు, రాజమౌళి లాంటివాళ్లు ఈ సినిమాపై తాజాగా రివ్యూ ఇచ్చారు. ‘ది బ్లఫ్.. యాక్షన్, ఎమోషన్స్కు ఉన్న సినిమా. ప్రియాంక అదరగొట్టింది అని మహేశ్ తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు. దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ ‘వారణాసి’ సినిమా గురించి లీక్ ఇచ్చింది.
థాంక్యూ మై ఫ్రెండ్ అని మహేశ్కు రిప్లై పెట్టిన ప్రియాంక అక్కడితో ఆగకుండా త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం అని రాసింది. అంటే నెక్స్ట్ ఈ సినిమా షెడ్యూల్ అంటార్కిటికాలో ఉంది అని అర్థం. ఆ లెక్కన చాలా రోజుల తర్వాత ‘వారణాసి’ అప్డేట్ వచ్చిందని మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు సంబరపడుతున్నారు. అయితే అంటార్కిటా వెళ్లి సినిమా షూటింగ్ చేస్తారా అనేదే డౌట్. ఎందుకంటే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా సెట్స్లోనే తీసి విజువల్ ఎఫెక్ట్స్లో సెట్ చేశారు జక్కన్న.
ఇదిలా ఉండగా ‘ది బ్లఫ్’ సినిమాపై రాజమౌళి కూడా ఓ పోస్ట్ పెట్టారు. వెంటవెంటనే హావభావాలు మార్చే సన్నివేశాల్లో బాగా నటించడం కొంతమంది హీరోయిన్స్కు మాత్రమే సాధ్యం. ప్రియాంక అలాంటివారిలో ఒకరు. ‘ది బ్లఫ్’ ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇందులోని యాక్షన్ సన్నివేశాలను పూర్తిగా ఆస్వాదించాను అని రాజమౌళి రాసుకొచ్చారు.